హుబ్బళి: రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా స్టార్లతో నిండిన కర్నాటకపై జమ్మూ కాశ్మీర్ పట్టు బిగించింది. వరుసగా రెండో రోజు బ్యాటింగ్లో దుమ్మురేపింది. ఓవర్నైట్ స్కోరు 284/2తో బుధవారం ఆట కొనసాగించిన జమ్మూ రెండో రోజు చివరకు తొలి ఇన్నింగ్స్లో 527/6 భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ సెంచరీ వీరుడు శుభమ్ పుండిర్ (121) తొందరగానే ఔటైనా.. కెప్టెన్ పారస్ డోగ్రా (70), కన్హయ్య వాధ్వన్ (70) ఐదో వికెట్కు 110 రన్స్ జోడించి భారీ స్కోరుకు బాటలు వేశాడు. చివర్లో సాహిల్ లోత్రా (57 బ్యాటింగ్), అబిద్ ముస్తాక్ (20 బ్యాటింగ్) స్కోరు 500 మార్కు దాటించి క్రీజులో ఉన్నారు. . కర్నాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ (3/90) మూడు వికెట్లు పడగొట్టగా.. మిగతా వాళ్లు నిరాశపరిచారు.
వివాదంలో డోగ్రా
రెండో రోజు ఆటలో జమ్మూ కెప్టెన్ పారస్ డోగ్రా కర్నాటక సబ్స్టిట్యూట్ ప్లేయర్ అనీష్తో గొడవపడి వివాదంలో చిక్కుచుకున్నాడు. తాను బ్యాటింగ్ చేస్తుండగా సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డిగ్ చేస్తున్న అనీష్ హెల్మెట్ను డోగ్రా తన తలతో బలంగా ఢీకొట్టడంతో(హెడ్-బట్)గ్రౌండ్లో ఉద్రిక్తత నెలకొంది. కర్నాటక కెప్టెన్ పడిక్కల్ దీనిపై ఫిర్యాదు చేయడంతో డోగ్రాపై రిఫరీ భారీ ఫైన్ విధించే చాన్సుంది.
