- లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ
- విజయవాడలో ‘మూడు దారులు’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్, వెలుగు: సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ నడిచిన ఏకైక సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల పరిపాలనను విశ్లేషిస్తూ సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ‘మూడు దారులు’పేరుతో రాసిన పుస్తకాన్ని శనివారం ఏపీలోని విజయవాడలో ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు.
కొంతమంది సీఎంలు పూర్తిగా సంక్షేమంపైనే దృష్టిపెడితే, మరికొందరు అభివృద్ధిపై దృష్టిపెట్టారని, కానీ ఈ రెండింటిని స మన్వయం చేసుకుంటూ వైఎస్సార్ వెళ్లారన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకం పాటించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. స్వర్ణాంధ్ర దినపత్రిక సంపాదకుడు కేబీజీ తిలక్ మాట్లాడుతూ.. ముగ్గురు సీఎం అనుసరించిన పంథాను మూడుదారులు పేరిట ఒకే పుస్తకంలో తీసుకురావడం కత్తిమీద సాములాంటిదన్నారు.
పుస్తక రచయిత దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. తమ పాలన ద్వారా రాజకీయాలపై తమదైన ముద్ర వేసుకున్న చంద్రబాబు, వైఎస్సార్, జగన్ మోహన్ రెడ్డిలను దగ్గర నుంచి చూసిన అనుభవాలను పుస్తకరూపంలో తీసుకొచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల వారికి దక్షిణాది రాజకీయాలపై చిన్నచూపు ఉందని, దీనిని చెరిపివేయాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తొలుత ఇంగ్లీషులో విడుదల చేసి, తెలుగులో మూడుదారుల పేరిట ప్రచురించినట్లు ఆయన తెలిపారు.