- ఇంటర్నేషనల్ రూట్ల టిక్కెట్లకు రెక్కలు
- గరిష్టంగా 58 శాతం పెరిగిన ధరలు
న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్ మూతపడటంతో పలు ఇంటర్నేషనల్ రూట్లకు టిక్కెట్ ధరలు భారీగా పెరిగాయి. లండన్, న్యూయార్క్, సిడ్నీ, దుబాయ్, టొరొంటో ప్రాంతాలకు విమానయానం మరింత కాస్ట్లీగా మారినట్టు ట్రావెల్ ప్లాట్ఫామ్ క్లియర్ట్రిప్లో వెల్లడైంది. జూన్ నెలలో ఈ ప్లాట్ఫామ్ సేకరించిన డేటా ప్రకారం ముంబై–టొరొంటో మార్గంలో విమాన టిక్కెట్ ధర గరిష్టంగా 58 శాతం పెరిగినట్టు తెలిసింది. ముంబై–న్యూయార్క్ రూట్లో 49 శాతం, ముంబై–సింగపూర్ మార్గంలో 36 శాతం టిక్కెట్ ధరలు పెరిగినట్టు వెల్లడైంది. ఇవి కేవలం జూన్ నెలకు సంబంధించినవే. 140కి పైగా ప్లేన్స్ కలిగిన జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17 నుంచి పూర్తిగా తన కార్యకలాపాలను నిలిపివేసింది. 2018 డిసెంబర్ వరకు ఈ ఎయిర్లైన్ సుమారు 120 ఇంటర్నేషనల్ విమానాలను నడిపింది. అకస్మాత్తుగా జెట్ మూతపడటంతో అంతర్జాతీయ రూట్లకు విమానాల సంఖ్య తగ్గిపోయింది. ముంబై–లండన్ వంటి మార్గాలకు జెట్ ఎయిర్వేస్ రోజుకు మూడు విమానాలను నడిపేదని ఎఫ్సీఎం ట్రావెల్ సొల్యుషన్ ఎండీ రక్షిత్ దేశాయ్ అన్నారు.