అర్థాంతరంగా జెట్ ఎయిర్వేస్ సేవలు ఆగిపోవడంతో, ఆ సంస్థ ఉద్యోగులు రాష్ట్రపతికి తమగోడును విలపించుకున్నారు. వేతన బకాయిలుచెల్లించేలా, ఈ ఎయిర్లైన్స్కు ఎమర్జెన్సీ ఫండింగ్ అందించేలా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని ఉద్యోగులు కోరారు. నిధులలేమితో ఈ నెల 17న మూతపడిన జెట్ లో సుమారు 23వేల మంది ఉద్యోగులున్నారు. వీరి భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, రెండు ఉద్యోగ సంఘాలు ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి లేఖలు రాశాయి. తమ వేతన బకాయిలు క్లియర్ చేయాలని ఈ లేఖల్లో పేర్కొన్నాయి.
లేఖలు రాసిన ఉద్యోగ సంఘాల్లో సొసైటీ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలెట్స్(సీడబ్ల్ యూఐపీ), జెట్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(జేఏఎంఈ-డబ్ల్ యూఏ) ఉన్నాయి. ప్రభావితమైన ఉద్యోగులందరి వేతన బకాయిలు వెంటనే చెల్లించేలా జెట్ ఎయిర్ వేస్మేనేజ్ మెంట్ ను ఆదేశించాలని కోరాయి. అంతేకాక ఈ ఎయిర్లైన్కు ఎమర్జెన్సీ ఫండింగ్ అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నాయి. పైలెట్లు, ఇంజనీర్లకు జెట్ ఇప్పటికి మూడు నెలల జీతాలు ఇవ్వాలని, మిగతా స్టాఫ్ కు ఒక నెల బాకీ పడిందని లేఖలో పేర్కొన్నాయి. అన్నిరకాల ప్రయత్నాల తర్వాత నమ్మకం కోల్పోయామని, ఇక మీరైనా కలుగజేసుకుని వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని యూనియన్లు కోరాయి.