
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు ఐదు నెలల జైలు జీవితం గడిపిన సోరెన్ విడుదలై.. మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మోదీతో మొదటి మీటింగ్. ఈ ఏడాది చివర్లో జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఈ భేటీకి ప్రాముఖ్యత సంతరించుకుంది. సోరెన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ "ప్రధానితో ఇది మర్యాదపూర్వక సమావేశం" అని కోట్ రాశారు.
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 31న అరెస్టు చేయడానికి ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జూన్ 28న సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. జూలై 4న ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.