వెలుగు బిజినెస్ డెస్క్ : మన పాత అలవాట్లలో చాలా వాటిని కరోనా మహమ్మారి మార్చేసింది. అలా మార్చేసిన వాటిలో మనం సినిమాలు చూసే విధానం కూడా ఉంది. సినిమాలకి రెగ్యులర్గా వెళ్లేవాళ్లకి ఇప్పుడు ఓటీటీ (ఓవర్ ది టాప్)లే సినిమా థియేటర్లుగా మారిపోయాయి. సినిమాలు చూడటానికి ఇప్పుడు ఎక్కడికీ కదలాల్సిన అవసరమే లేదు. మహా అయితే మనింట్లో మనం కూర్చున్న ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్లాల్సి ఉంటుంది, అంతే. ఇక మొబైల్లో ఓటీటీనైతే....ఎక్కడైనా....ఎప్పుడైనా చూసేయొచ్చు. సినిమాలు చూసే వాళ్ల ఇష్టాలకి అనుగుణంగానే కంటెంట్ కూడా మారుతోంది. ప్రస్తుతం ఓటీటీ స్టార్లు పాపులర్ అవుతున్నారు. హీరోయిన్లే కథలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసే సినిమాలూ ఇప్పుడు ఎక్కువయ్యాయి. గతంతో పోలిస్తే సినిమాల నిడివి తగ్గిపోయింది. కొంతమందయితే కొన్ని షార్ట్ ఫిల్మ్లను కలిపేసి కలెక్షన్గానూ తెస్తున్నారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ హాట్ ట్రెండ్గా నడుస్తోంది. అవే ఫేవరెట్లుగా నిలుస్తున్నాయి. అంతమాత్రాన పాత ఫార్మాట్ సినిమాలు కనిపించకుండా పోతున్నాయని కాదు. వాటి ప్లేస్ వాటిదే. కరోనా మహమ్మారి రాకతో 2020 లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఊపందుకున్నాయి. ఆ ఏడాది మల్టీప్లెక్స్లు, సినిమా హాళ్లు చాలా వరకు మూసివేసే ఉన్నాయి. ఇళ్లకే పరిమితమైన ఆడియెన్స్ ఎంటర్టెయిన్మెంట్ కోసం డిజిటల్ స్క్రీన్స్పైనే ఆధారపడ్డారు. అప్పటిదాకా అందుబాటులో ఉన్న హిందీ, ఇంగ్లీష్ కంటెంట్ను చూడటం మొదలెట్టారు.
రీజినల్ ఓటీటీ ప్లాట్ఫామ్లు ..
ఇదే టైములో తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతి వంటి రీజినల్ కంటెంట్పై ఇంటరెస్ట్ విపరీతంగా పెరిగింది. దీంతో చాలా రీజినల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పుట్టుకొచ్చాయి. ఓహో గుజరాతి (గుజరాతి), హోయిచోయి (బెంగాలి), సన్ నెక్స్ట్ (దక్షిణాది రాష్ట్రాలు), ఆహా (తెలుగు) వంటివి అందులో ఉన్నాయి. ఇవన్నీ ఆడియన్స్ దగ్గర పాపులారిటీ సంపాదించుకోవడంలో ఎక్కువగా సక్సెసయ్యాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్స్టార్ వంటి పెద్ద ప్లేయర్లతో ఈ రీజినల్ ఓటీటీలు గట్టిగానే పోటీపడుతున్నాయి. స్కామ్ 1992 వెబ్ సిరీస్తో ప్రతీక్ గాంధి పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ నానుతోంది. ఫ్రెష్గా ఉండటంతోపాటు, కొత్తగా ఉంటుండడంతో రీజినల్ స్టోరీస్కు పాపులారిటీ ఎక్కువగా వస్తోందని ప్రతీక్ గాంధి చెబుతున్నారు. ఇప్పుడు రిజినలే కొత్త గ్లోబల్ అని అన్నారాయన. మనం ఇక్కడ స్పానిష్ కంటెంట్ చూస్తున్నాం, అలాగే ఆ దేశంలో మన తెలుగు, గుజరాతి కంటెంట్ను చూస్తూ ఉండి ఉండొచ్చని చెప్పారు. రీజినల్ స్టోరీలన్నీ కంటెంట్ ఆధారంగా నడుస్తున్నాయని, స్టార్ల వల్ల కాదని కూడా పేర్కొన్నారు. తాజాగా మలయాళంలో వచ్చిన జోజి బాగుందని గాంధి పేర్కొన్నారు.
రీజినల్ కంటెంట్కు గిరాకీ
రీజినల్ కంటెంట్కు ఆడియెన్స్ పెరుగుతున్న నేపథ్యంలో తమ కంటెంట్ ఆఫరింగ్స్నూ ఎక్కువ చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లు కూడా రీజినల్ కంటెంట్పై ఫోకస్ పెడుతున్నాయి. సన్ నెక్స్ట్ వద్ద ఏకంగా 4 వేల సౌత్ ఇండియన్ సినిమాల లైబ్రరీనే ఉంది. హోయిచోయి బెంగాలిలో ఇప్పటికే 80 షోలను రిలీజ్ చేసింది. మరో 20 షోలు, డజను సినిమాలు పైప్లైన్లో ఉన్నాయని చెబుతోంది. గుజరాతిలో ప్రీమియం కంటెంట్ ఆఫర్ చేసేందుకు ఓహో గుజరాతిని ఫిల్మ్ మేకర్ అభిషేక్ జైన్ తెచ్చారు. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్కు టైర్ 2, టైర్ 3 సిటీల నుంచే ఇటీవల ఎక్కువ మంది ఆడియెన్స్ వస్తున్నారు. రీజినల్ కంటెంట్ బూమ్కు ఇది కూడా ముఖ్యమైన కారణంగా నిలుస్తోంది. 2017లో మొదలైన బెంగాలి ఓటీటీ హోయిచోయి 13 లక్షల మంది సబ్స్క్రయిబర్లను, లాంచైన ఏడాదిలోపే తెలుగు ఓటీటీ ఆహా 10 లక్షల మంది పెయిడ్ సబ్స్క్రయిబర్లను తెచ్చుకోగలిగాయి. చిన్న సిటీలలోని ప్రజలు రీజినల్ కంటెంటెకు ఈజీగా కనెక్ట్ అవుతుండటమే ఓటీటీల సక్సెస్కి కారణం.