
హైదరాబాద్ నుంచి మరో బుల్లెట్ ట్రైన్ను ప్రతిపాదించిన రైల్వే శాఖ
రూ. లక్షా 23 వేల 600 కోట్లతో 618 కిలోమీటర్ల మేర కారిడార్
హైదరాబాద్, వెలుగు: సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో బెంగళూరుకు పోవాలంటే కనీసం ఆరు గంటలైనా పడుతుంది. ఆ టైం 2 గంటలకు తగ్గితే.. జర్నీ హాయిగా ఉంటుంది కదా. దాన్ని నిజం చేసేలా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే హైదరాబాద్– ముంబై రూట్లో బుల్లెట్ ట్రైన్కు ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా హైదరాబాద్– బెంగళూరుకూ మరో బుల్లెట్ ట్రైన్ నడపాలని నిర్ణయించింది. దేశంలో 12 కారిడార్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన రైల్వే శాఖ.. అందులో హైదరాబాద్–బెంగళూరు కారిడార్ను రూ.లక్షా 23 వేల 600 కోట్లతో నిర్మించాలని నిర్ణయించింది. 618 కిలోమీటర్ల మేర కారిడార్ను నిర్మించనుంది. ప్రాజెక్టును 2031–2041 మధ్య పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ల కోసం స్పెషల్ ట్రాక్లను నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న ట్రాక్లు కేవలం 80 నుంచి 160 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకుంటాయి. అయితే, బెంగళూరుకు ఏ రూట్లో ట్రాక్ వేస్తారన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి గుంటూరు, నడికుడి మీదుగా, కాచిగూడ నుంచి మహబూబ్నగర్ రూట్లో, వికారాబాద్ నుంచి వాడీ మీదుగా బెంగళూరు వెళ్లేందుకు మూడు రూట్లు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్– ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర రూ.లక్షా 41 వేల 800 కోట్లతో బుల్లెట్ ట్రైన్ కారిడార్ను రైల్వే శాఖ ప్రతిపాదించింది. డీపీఆర్ల కోసం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది పనులు మొదలయ్యే చాన్స్ ఉంది.