
రాఖీ పండుగ దగ్గర పడింది. ఈ ఏడాది (2025) ఆగస్టు 9న సిస్టర్స్ అండ్ బ్రదర్స్ రాఖీ సెలబ్రేషన్స్ కు రడీ అవుతున్నారు. రాఖీ కట్టిన సోదరుడికి కమ్మని స్వీట్ తినిపించాలి. అదే తన చేత్తో తయారుచేసిన స్వీటంటే.. ఇక వారి అనుబంధానికి తిరుగుండదు. రాఖీ పండుగ రోజు సింపుల్గా .. తేలికగా కమ్మనైన.. రుచికరమైన స్వీట్స్తయారీ విధానం మీకోసం. . .
బేసిన్ పిస్తా బర్ఫీ తయారీకి కావాల్సినవి:
- శెనగపిండి - ఒక కప్పు
- చక్కెర -రెండు కప్పులు
- పాలు- ఒక కప్పు
- నెయ్యి-సరిపడా
- కొబ్బరి తురుము- ఒక కప్పు
- పిస్తా పప్పు- ముప్పావు కప్పు
తయారీ విధానం: స్టవ్పై పాన్ పెట్టి నెయ్యి వేడి చేయాలి. అందులో శెనగపిండి వేయాలి. పచ్చివాసన పోయేవరకు పిండిని సన్నని మంటపై వేగించాలి. తర్వాత అందులోనే పాలు పోసి బాగా మిక్స్ చేయాలి. శెనగపిండి ఉండలు కట్టకుండా
కలిపి, రెండు నిమిషాల తర్వాత చక్కెర వేయాలి. పావుగంట తర్వాత దోరగా వేగించిన కొబ్బరి తురుము వేయాలి. ఐదు నిమిషాలు సన్నని మంటపై మిశ్రమాన్ని ఉడికించాలి. స్టవ్ ఆపేసి మిశ్రమాన్ని వెయ్యి రాసిన వెడల్పాటి ప్లేట్ లో వేయాలి. దానిపై మూతపెట్టి ఆరు నుంచి ఏడు గంటలు పక్కనబెట్టాలి. చాకుతోవచ్చిన ఆకారాల్లో బర్ఫీలను కట్ చేసి, వాటిని నెయ్యిలో వేగించిన పిస్తాపప్పుతో డెకరేట్ చేయాలి.
పన్నీర్ ఖీర్ తయారీకి కావలసినవి
- పన్నీర్ తురుము - ఒక కప్పు
- పాలు - ఒక లీటర్
- బియ్యప్పిండి - ఒక టేబుల్ స్పూన్
- ఇలాచీ పొడి - పావు టీ స్పూన్
- చక్కెర పొడి- పావు కప్పు
- కుంకుమ పువ్వు - చిటికెడు
- డ్రై ఫ్రూట్స్ (బాదం, పిస్తా, జీడిపప్పు)– పావు కప్పు
- నెయ్యి -సరిపడా
తయారీ విధానం: గిన్నెలో పాలు పోసి మరిగించాలి. అందులో బియ్యప్పిండి వేసి పది నిమిషాలు ఉడికించాలి. మరోవైపు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేగించాలి. పాల మిశ్రమంలో డ్రైఫ్రూట్లు, ఇలాచీ పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి. ఐదు నిమిషాలయ్యాక చక్కెర పొడి వేసి మిశ్రమం గట్టిపడేవరకు ఉడికించాలి. తర్వాత మంట తగ్గించి పన్నీర్ తురుము వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత దింపేసి పైనుంచి కుంకుమ పువ్వు లేదా డ్రై ఫ్రూట్స్ వేయాలి.