![ఈవీల కోసం రూ.40 వేల కోట్లు .. ఒడిశా ప్రభుత్వంతో ఒప్పందం](https://static.v6velugu.com/uploads/2024/02/jsw-group-to-set-up-ev-manufacturing-industrial-complex-in-odisha_TkKQCLinW5.jpg)
- ఇన్వెస్ట్ చేయనున్న జేఎస్డబ్ల్యూ గ్రూప్
న్యూఢిల్లీ: జేఎస్డబ్ల్యూ గ్రూప్ రూ. 40 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్స్ వెహికల్స్(ఈవీ) ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ఒడిశా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ కంపెనీకి స్టీల్, ఎనర్జీ, సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెయింట్స్, వెంచర్లు, స్పోర్ట్స్ వంటి వ్యాపారాలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) ఈవీ బ్యాటరీ తయారీ కోసం ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నామని, కటక్, పారాదీప్లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కంపెనీ తెలిపింది.
ఫలితంగా 11 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. ఈ ప్రాజెక్ట్లో 50 గిగావాట్అవర్ ఈవీ బ్యాటరీ ప్లాంట్, ఈవీలు, లిథియం రిఫైనరీ, కాపర్ స్మెల్టర్ సంబంధిత కాంపోనెంట్ తయారీ యూనిట్లు ఉంటాయి. శనివారం జరిగిన ఎంఓయూ సంతకాల కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి ప్రతాప్ కేసరీ దేవ్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, ఒడిశా ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.