డ్రగ్స్ తయారీ, సప్లై, అమ్మకం, వాడకంపై కఠిన శిక్షలు : జడ్జి పాటిల్ వసంత్

డ్రగ్స్ తయారీ, సప్లై, అమ్మకం, వాడకంపై కఠిన శిక్షలు : జడ్జి పాటిల్ వసంత్
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లా  జడ్జి పాటిల్​ వసంత్​ 
  • డ్రగ్స్​కు వ్యతిరేకంగా యువతను సైనికుల్లాగా తయారు చేయాలి
  • కలెక్టర్​జితేశ్​ వి పాటిల్​ ​ 
  • ‘చైతన్యం–డ్రగ్స్​పై యుద్ధం’ ముగింపు సందర్భంగా ర్యాలీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డ్రగ్స్​ తయారీ, సప్లై, అమ్మకం, వాడకంపై కఠిన శిక్షలున్నాయని జిల్లా జడ్జి పాటిల్​ వసంత్​ తెలిపారు. పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో ‘చైతన్యం – డ్రగ్స్​పై యుద్ధం’ ముగింపు ప్రోగ్రాం సందర్భంగా కొత్తగూడెంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. 

అనంతరం నగరంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. డ్రగ్స్​ తయారీ, సప్లై, అమ్మకం, వాడకాలపై నేరం రుజువైతే కఠిన కారాగార శిక్షలు, భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. డ్రగ్స్​ రహిత సమాజం కోసం న్యాయవ్యవస్థ ఎప్పుడూ పోలీస్​లకు, ప్రజలకు అండగా ఉంటుందన్నారు. 

కలెక్టర్​ జితేశ్​మాట్లాడుతూ డ్రగ్స్​కు వ్యతిరేకంగా యువతను సైనికుల్లాగా తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్​ లేని సమాజం రూపొందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. డ్రగ్స్​పై పోలీస్​లకు ప్రజలు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్​ బారిన పడిన వారికి సరైన ట్రీట్​మెంట్​ ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎస్పీ బి. రోహిత్​ రాజు మాట్లాడుతూ డ్రగ్స్​ నియంత్రణలో పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. 

గంజాయి అక్రమ రవాణా కట్టడి విషయంలో జిల్లా పోలీసులు అద్భుత ప్రతిభ చూపుతున్నారన్నారు. ర్యాలీలో పెద్ద  సంఖ్యలో యువత పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం డ్రగ్స్​ నియంత్రణకు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. 

ఈ ప్రోగ్రాంలో డీఎఫ్​ఓ కృష్ణాగౌడ్​, అడిషనల్​ ఎస్పీ నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్​ కుమార్​ సింగ్​, ఆర్టీఓ వెంకటరమణ, ఎక్సైజ్​సూపరింటెండెంట్​ జానయ్య, మున్సిపల్​కార్పొరేషన్​ కమిషనర్​ సుజాత, డీఎస్పీలు రెహమాన్​, చంద్రభాను, రవీందర్​ రెడ్డి, సతీశ్​ కుమార్, మల్లయ్య స్వామి, అశోక్​, సత్యనారాయణ పాల్గొన్నారు.