- ఒక కేసులో తీర్పు మరో కేసుకా
- ఒక్క పదమూ మార్చరా?
- స్పెషల్ రెవెన్యూ ట్రిబ్యునల్స్ తీరుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ల్యాండ్స్, పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ కింద జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన స్పెషల్ రెవెన్యూ ట్రిబ్యునల్స్ న్యాయసూత్రాలకు విరుద్ధంగా చేస్తున్నాయని, పదం కూడా మార్చకుండా.. ఒక కేసులో తీర్పు.. మరో కేసులో పేర్కొనడం ఏంటని హైకోర్టు మండిపడింది. ట్రిబ్యునల్స్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్స్ పనితీరు చట్టబద్ధంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్రావు ఉత్తర్వులిచ్చారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన స్పెషల్ రెవెన్యూ ట్రిబ్యునల్స్ పనితీరు ఏకపక్షంగా ఉందని, తమ గోడు చెప్పుకునే అవకాశాలు ఇవ్వట్లేదని దాఖలైన పిటిషన్లను హైకోర్టు గురువారం విచారించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ మొదలైన జిల్లాల్లో రెవెన్యూ ట్రిబ్యునల్స్ తీర్పులపై మండిపడింది. పదాలను కూడా మార్చకుండా ఒక కేసులోని తీర్పునే మరో కేసులో కూడా పేర్కొనడం ఏమిటని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న కలెక్టర్లు వారి నేతృత్వంలోని ట్రిబ్యునల్స్ తీర్పులు ఈ తరహాలో చెప్పడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని తెలిపింది. ఈ మేరకు రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లకు కోర్టుధిక్కార నోటీసులు జారీ చేసింది.