- విస్తరణను పట్టించుకోని బల్దియా
- గ్రేటర్లో 90 జంక్షన్ల అభివృద్ధి ఎక్కడ?
మాసబ్ ట్యాంక్ సిగ్నల్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నం10 వరకు నాలుగు సిగ్నల్స్ఉండగా, ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ అవుతనే ఉంటోంది. ఏ సిగ్నల్ వద్ద కూడా సరైనా సిస్టమ్ లేకపోగా ఇరువైపులా అర కిలోమీటరు మేర వెహికల్స్ నిలిచిపోతుంటాయి. ఈ సిగ్నల్స్ వద్ద కొన్నేండ్లుగా పరిస్థితి ఇలాగే ఉండగా ఎవరూ పట్టించుకోవడం లేదు. మెహీదీపట్నం నుంచి టోలిచౌకి, లంగర్ హౌస్ వెళ్లే రూట్లోని రేతిబౌలి, నానల్ నగర్, ఆలివ్ హాస్పిటల్ సిగ్నల్స్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. టోలిచౌకి నుంచి వచ్చే వెహికల్స్కు ఫ్రీ లెఫ్ట్ సూచిక బోర్డులు కూడా లేవు. దీంతో లంగర్ హౌస్ వైపు వెళ్లే వెహికల్స్ సిగ్నల్ వద్ద నిలుపు తుండగా టోలిచౌకి వైపు కి,మీ దాకా ట్రాఫిక్ జామ్ అవుతోంది. సాయంత్రం టైమ్లో మెహిదీపట్నం నుంచి రేతిబౌలి చేరుకోవాలంటే అరగంట టైమ్ పడుతోంది.
హైదరాబాద్, వెలుగు: సిటీలో ట్రాఫిక్జంక్షన్ల విస్తరణను బల్దియా పెద్దగా పట్టించుకోవట్లేదు. మెట్రోరైల్ పనులు పూర్తయిన తర్వాత మెయిన్జంక్షన్లు తీసేశారు. చాలా చోట్ల సిగ్నల్ ఫ్రీ యూ టర్న్లు పెట్టారు. ఏండ్లుగా జంక్షన్ల అభివృద్ధి పనులు స్లోగా నడుస్తుండగా, ట్రాఫిక్ జామ్అయ్యే ప్రాంతాల్లోనూ విస్తరణపై అధికారులు దృష్టిపెట్టట్లేదు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. నాంపల్లి, పంజాగుట్ట, లిబర్టీ, రేతిబౌలి, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్రోడ్డు నంబర్12, రోడ్ నంబర్10, తాజ్ కృష్ణ, ప్యారడైస్, ప్యాట్నీ, రాణిగంజ్, కోఠి, ఇందిరాపార్కు, పురానాపూల్, చాదర్ఘాట్, మలక్ పేట్, లింగంపల్లి ఇలా తదితర ప్రధాన జంక్షన్ల వద్ద సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎప్పటి నుంచో ఆయా జంక్షన్లు ఇలాగే ఉంటుండగా, మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ట్రాఫిక్ జామ్లు అవుతుండగా సమస్య తీవ్రంగానే ఉంది.
ఇంకెప్పుడు చేస్తరో..
ఒకప్పుడు సిగ్నల్ కూడా అవసరంలేని జంక్షన్లలో ఇప్పుడు కిలోమీటరు మేర వాహనాలు నిలుస్తున్నాయి. రెండున్నరేండ్ల కిందట పోలీస్ శాఖ సూచనల మేరకు సిటీలో 90 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు బల్దియా చర్యలు చేపట్టింది. విస్తరణ పనులను జోనల్ కమిషనర్లకు అప్పగించింది. 69 జంక్షన్ల వద్ద పనులు పూర్తయినట్లు, 21 జంక్షన్ల వద్ద త్వరలో పనులు పూర్తికానున్నట్లు అధికారులు చెబుతూనే ఉండగా, గ్రౌండ్ లెవల్లో చూస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. ఎప్పుడో పూర్తయిన హైటెక్ సిటీ, వంద ఫీట్ల రోడ్డు, ఎల్బీనగర్, ఖైరతాబాద్, నెక్లెస్రోడ్, ఫైనాన్షియల్డిస్ట్రిక్ట్లోని పలు జంక్షన్లను గతేడాదిలో పూర్తిచేసినట్లు బల్దియా చూపుతోంది. కొత్త జంక్షన్ల డెవల్ మెంట్పైన కూడా ఫోకస్చేయట్లేదు. ఎల్బీనగర్జోన్ లో 11, చార్మినార్ జోన్ లో 9, ఖైరతాబాద్ జోన్ లో 34, శేరిలింగం పల్లి జోన్లో 11, కూకట్ పల్లి జోన్లో 10, సికింద్రాబాద్ జోన్ లో 15 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు నిర్ణయించగా ఇందులో సగం కూడా పూర్తికాలేదు.
మోడ్రన్ టెక్నాలజీతో సిగ్నల్స్
గ్రేటర్ లో మొత్తంగా 221 సిగ్నల్స్ ఉండగా ప్రధాన రూట్లలో మోడ్రన్టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం ద్వారా వాటిని మానిటరింగ్ చేస్తుండగా ఎంపిక చేసిన సిగ్నల్స్ వద్ద ఏటీసీ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. వీటిని ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్లాన్ చేసినా ఆ విధంగా పనులైతే కొనసాగట్లేదు.
రోజులో ఎప్పుడు చూసినా..
నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు ఎదురెదురుగా రెండు పెద్ద వాహనాలు వెళ్లేందుకు వీలులేదు. ఇక్కడి నుంచే ఎంజీబీఎస్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే బస్సులు రోజుకు వెయ్యికిపైగా ప్రయాణిస్తాయి. లక్షకుపైగా వాహనాలను వెళ్తుంటాయి. ఇక్కడ రోజులో ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మలక్పేట్ నుంచి చాదర్ ఘాట్ రూట్ లోనూ కిలోమీటర్ మేర రద్దీ ఉంటుండగా రోడ్డు విస్తరణ అయితే చేయట్లేదు. మెహిదీపట్నం నుంచి రేతిబౌలి రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. నాగార్జున సర్కిల్నుంచి పంజాగుట్ట కు వెళ్లే రూట్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. మొత్తానికి రోడ్ల విస్తరణతోనే ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రయాణించేందుకు వీలుంటుంది.
సిగ్నల్ రూట్ మార్పుతోనే ప్రాబ్లమ్
మెహిదీపట్నం నుంచి నానల్ నగర్వెళ్లే రూట్లో రేతిబౌలి వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సిగ్నల్పేరుతో రూట్ను మార్చగా సమస్య వచ్చింది. సాయంత్రం టైమ్ లో మెహిదీపట్నం వరకు ట్రాఫిక్జామ్అవుతుంది. ఇంతకు ముందు బాగున్న ప్పటికి, ఇటీవల నుంచే ప్రాబ్లమ్ వస్తోంది.
- హుస్సేన్, మెహిదీపట్నం
రోడ్డు విస్తరణతోనే పరిష్కారం
అబిడ్స్నుంచి నాంపల్లి రూట్లో మెట్రో స్టేషన్ కింద సిగ్నల్ వద్ద ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతుంది. ఒక్కో సారి అరగంట సమయం పడుతుంది. ఇక్కడ రోడ్డు విస్తరణ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. దీనిపై అధికారులు ఫోకస్ పెట్టాలె.
- శ్రీనివాస్ సాగర్, నాంపల్లి