HMDA పరిధిలో.. మరో మూడు కొత్త రైల్వేటెర్మినల్స్

HMDA పరిధిలో.. మరో మూడు కొత్త రైల్వేటెర్మినల్స్
  • ప్రస్తుత టెర్మినల్స్​పై ఒత్తిడి తగ్గించేందుకే..  
  • ఒక్కోచోట 14 నుంచి 20 వరకు ప్లాట్​ఫామ్స్​
  • ప్రపోజల్స్​రెడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన  రైల్వే

హైదరాబాద్​సిటీ, వెలుగు: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి పెరుగుతున్న రైళ్ల రాకపోకల కారణంగా పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు గ్రేటర్​పరిధిలో మరో మూడు కొత్త రైల్వే టెర్మినల్స్​నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే ప్లాన్లు రూపొందించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఇందులో భాగంగా ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్ మధ్య కొత్త రైల్వే టెర్మినల్స్​నిర్మించనున్నారు.

 ఇప్పటికే నగరంలో ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి, లింగంపల్లిలో ఉన్న టెర్మినల్స్​పై భారీగా ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో కొన్ని నెలల కింద చర్లపల్లి రైల్వే టెర్మినల్​నిర్మించారు. అయినా, ఇతర మెట్రోనగరాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను, ఇప్పుడున్న టెర్మినల్స్​లో నిలిపేందుకు తగినన్ని ప్లాట్​ఫామ్స్​లేక కొన్నింటిని శివారు ప్రాంతాలకే పరిమితం చేయాల్సి వస్తోంది. 

నగరం కూడా విస్తరిస్తుండడం, జనాభా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. అందుకే, హైదరాబాద్​చుట్టూ కొత్తగా మూడు టెర్మినల్స్​నిర్మించేందుకు రైల్వే ప్రపోజల్స్​రెడీ చేసింది. వీటిని ట్రిపుల్​ఆర్​, ఓఆర్​ఆర్​మధ్య నిర్మించడం ద్వారా నగరంపై ఒత్తడిని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.  

ఎక్కడెక్కడ అంటే..

ట్రిపుల్​ఆర్​వరకూ విస్తరిస్తున్న హైదరాబాద్​జనాభా 2047 నాటికి 3 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనా. ప్రస్తుతం బల్దియా పరిధిలో 1.13 కోట్ల జనాభా ఉండగా, 2031 నాటికి 1.84 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తూర్పున వరంగల్​రూట్​లో చర్లపల్లి రైల్వే టెర్మినల్​నిర్మించిన రైల్వే.. సిటీకి వెస్ట్ సైడ్ శంకర్ పల్లి సమీపంలోని నాగులపల్లిలోనూ, నార్త్ వైపు మేడ్చల్ అవతల డబీర్ పూర్​వద్ద, సౌత్ వైపు బెంగళూరు రూట్​లో శంషాబాద్ సమీపంలో జుక్కల్ వద్ద  రైల్వే టెర్మినల్స్ నిర్మించాలని భావిస్తోంది. ఈ టెర్మినల్స్​ పూర్తిచేస్తే ఇప్పటికే ఉన్న టెర్మినల్స్ పై ఒత్తిడి తగ్గి, గ్రేటర్ రైల్వే ప్యాసింజర్లకు ఇబ్బందులు తప్పుతాయని అనుకుంటున్నారు.  

భూసేకరణ పై దృష్టి

కొత్త రైల్వే టెర్మినల్స్​కు అవసరమైన భూములను సేకరించే పనుల్లో అధికారులు తలమునకలయ్యారు. నాగులపల్లి వద్ద నిర్మించే టెర్మినల్ కోసం 325 ఎకరాల భూమి అవసరమవుతుందని , ఇక్కడి టెర్మినల్​లో 20 ప్లాట్​ఫారాలు, 14 పిట్​లైన్స్​, మరో 24 స్టేబ్లింగ్​లైన్లు నిర్మించనున్నారు. 

డబీర్​పూర్​వద్ద నిర్మించే టెర్మినల్​కు 250 ఎకరాలు అవసరమవుతాయని, ఈ టెర్మినల్​లో 14 ప్లాట్​ఫారాలు, 10 పిట్​లైన్స్​, 14 స్టేబ్లింగ్​లైన్లు నిర్మించనున్నారు. జుక్కల్​టెర్మినల్​నిర్మాణానికి 300 ఎకరాల భూమి అవసరం కాగా, 18 ప్లాట్​ఫారాలు, 12పిట్​లైన్స్​, 20స్టేబ్లింగ్​లైన్లు నిర్మించనున్నట్టు చెప్పారు.