తెలంగాణ క‌ళ‌ల‌కు పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తాం: మంత్రి జూప‌ల్లి

తెలంగాణ క‌ళ‌ల‌కు పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తాం: మంత్రి జూప‌ల్లి

హైద‌రాబాద్:  జ‌న‌వ‌రి 13 నుంచి 15 వ‌ర‌కు హైద‌రాబాద్ లో జ‌రిగే కైట్ అండ్ అంత‌ర్జాతీయ‌ స్వీట్ ఫెస్టివ‌ల్ ను విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర ఎక్పైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. జనవరి 9వ తేదీ మంగ‌ళ‌వారం డా. బీఆర్. అంబేడ్కర్ స‌చివాల‌యంలో వివిధ దేశాలు, రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు ప్రతినిధులతో  మంత్రి జూప‌ల్లి బేటీ అయ్యారు.  

సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్ లో నిర్వహించే గాలి ప‌టాల పండుగ ఏర్పాట్లను చ‌ర్చించారు.  దేశ‌, విదేశాల‌ నుంచి వ‌చ్చే అతిధులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘ‌న‌మైన‌ ఆతిధ్యం ఇవ్వాల‌ని అధికారుల‌కు సూచించారు.   తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిభింబించేలా ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌న్నారు.  భ‌విష్యత్ లో ఈ వేడుక‌ను మ‌రింత ఘ‌నంగా నిర్వహించేందుకు ఏమైనా స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని.. ప్రతిపాద‌న‌లు అందజేయాల‌ని ప్రతినిధుల‌ను కోరారు. అనంత‌రం సెక్రటేరియ‌ట్ మీడియా పాయింట్ లో మంత్రి  జూప‌ల్లి మాట్లాడారు. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ఒక ‘మినీ ఇండియా’ అని  అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా  కాస్మోపాలిట‌న్ సిటీలో  స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఎన్నో మతాలకు హైదరాబాద్‌ నెలవుగా మారిందన్నారు. హైద‌ర‌బాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా అంత‌ర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్ ను నిర్వహిస్తామ‌ని పేర్కొన్నారు. సుమారు 15 ల‌క్షల మంది సంద‌ర్శకులు వ‌స్తార‌ని అంచనా వేస్తున్నామ‌ని తెలిపారు. 16 దేశాల‌కు చెందిన కైట్ ప్లేయ‌ర్స్ తో పాటు వివిధ రాష్ట్రాల  కైట్ ప్లేయ‌ర్స్  కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్ లో పాల్గొంటార‌ని వెల్లడించారు. వివిధ ర‌కాల‌, రంగుల ప‌తంగుల‌ను ఎగుర‌వేస్తార‌ని అన్నారు.

వివిధ రాష్ట్రాల‌కు చెందిన వారు త‌మ ఇంట్లోనే  త‌యారు చేసిన 400 ర‌కాల స్వీట్లతో పాటు తెలంగాణ వంట‌కాల‌ను  పుడ్ కోర్టులో విక్రయిస్తార‌ని  చెప్పారు.   సాంస్కృతిక కార్యక్రమాల‌ను కూడా ప్రద‌ర్శిస్తార‌ని తెలిపారు.  వీక్షకుల‌కు ఉచిత ప్రవేశం ఉంటుంద‌ని..  ఇంట‌ర్నేష‌న‌ల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్ కు అంద‌రూ ఆహ్వానితులేనని మంత్రి చెప్పారు.  రానున్న  రోజుల్లో  ఇంట‌ర్నేష‌న్ నేష‌న‌ల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివ‌ల్ ను పట్టణ‌, గ్రామీణ ప్రాంతాల‌కు విస్తారిస్తామ‌ని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, క‌ళ‌ల‌కు పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తామ‌ని మంత్రి జూప‌ల్లి అన్నారు.