- పెన్సిల్ షార్ప్నర్లపై జీఎస్టీ 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గింపు
- మీటింగ్లో రాని ఆన్లైన్ గేమ్స్ టాపిక్
బిజినెస్ డెస్క్, వెలుగు: రాష్ట్రాలకు రావాల్సిన మొత్తం జీఎస్టీ కాంపెన్సేషన్ బకాయిలను వెంటనే విడుదల చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. ఇందుకోసం రూ. 16,982 కోట్లు రిలీజ్ చేస్తున్నామని తెలిపింది. 49 వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఢిల్లీలో శనివారం జరిగింది. కిందటేడాది జూన్ నాటికి జీఎస్టీ అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ ట్యాక్స్ సిస్టమ్ను అమలు చేయడం వలన రాష్ట్రాలకు వచ్చిన రెవెన్యూ లాస్ను భర్తీ చేయడానికి కేంద్ర జీఎస్టీ కాంపెన్సేషన్ ఇస్తోంది. కిందటేడాది జూన్లో చెల్లించాల్సిన రూ.16,982 కోట్ల బకాయిలను ఇప్పటితో క్లియర్ చేస్తున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా, జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ను 2026, ఏప్రిల్ వరకు వసూలు చేయాలని 45 వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మోటార్ వెహికల్స్, కార్బోనేటెడ్ వాటర్స్, బొగ్గు, పాన్ మసాలా వంటి ప్రొడక్ట్లపై జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ను వేస్తున్నారు. కానీ, ఈ సెస్ ద్వారా సేకరించిన ఫండ్స్ను ఇక నుంచి రాష్ట్రాలకు ఇవ్వకుండా, 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాల్లో కాంపెన్సేషన్ ఇవ్వడానికి చేసిన అప్పులను తీర్చడానికి వాడతామని అప్పుడు ప్రకటించారు.
మరిన్ని అంశాలు..
1) కోర్టులు, ట్రిబ్యునల్స్ అందిస్తున్న కొన్ని సర్వీస్లపై ట్యాక్స్ వేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. రివర్స్ ఛార్జ్ మెకానిజం ద్వారా అంటే సర్వీస్లను పొందిన వారిపై ఈ జీఎస్టీ ట్యాక్స్ వేస్తారు.
2) ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మిషన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందిస్తున్న సర్వీస్లపై జీఎస్టీ మినహాయింపులిచ్చారు.
3) యాన్యువల్ జీఎస్టీ రిటర్న్లపై ఫైలింగ్ చేయడంలో ఆలస్యమైతే విధించే లేట్ ఫీజును కౌన్సిల్ రేషనలైజ్ చేసింది. ముఖ్యంగా జీఎస్టీ ఫామ్ 9 ను ఈ ఏడాది నుంచే రేషనలైజ్ చేస్తామని పేర్కొంది.
4) రూ. ఐదు కోట్ల వరకు యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లపై ఇక నుంచి లేట్ ఫీజుగా రోజుకి రూ.25 వేస్తారు. గరిష్టంగా టర్నోవర్లో 0.02 % వరకు వేస్తారు. రూ. 5 నుంచి 20 కోట్ల వరకు గల యాన్యువల్ రిటర్న్స్పై లేటు ఫీజుగా రోజుకి రూ.50, గరిష్టంగా టర్నోవర్లో 0.02 % విధిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఇది అమల్లో ఉంటుంది.
5) గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఇచ్చిన రిపోర్ట్లోని రెండు అంశాలను కౌన్సిల్ అంగీకరించింది. కొన్ని ఇండస్ట్రీలకు స్పెషల్ కాంపొజిషన్ స్కీమ్ను అమలు చేయడం, జీఎస్టీ ట్రిబ్యునల్ ఇందులో ఉన్నాయి. జీఎస్టీ ట్రిబ్యునల్కు సంబంధించి తగిన మార్పులు చేస్తామని, ఇంకో 5–6 రోజుల్లో డ్రాఫ్ట్ పేపర్లను రిలీజ్ చేస్తామని కౌన్సిల్ పేర్కొంది.
తగ్గిన జీఎస్టీ రేట్లు..
కొన్ని ప్రొడక్ట్లపై జీఎస్టీ ట్యాక్స్ను కౌన్సిల్ తగ్గించింది. బెల్లం పాకం (రాబ్) పై విధిస్తున్న 18 శాతం జీఎస్టీని తొలగించారు. అంటే ఇక నుంచి లూజ్గా అమ్మే రాబ్పై జీఎస్టీ ఉండదు. అదే ప్యాకేజ్డ్ రాబ్పై 5 శాతం జీఎస్టీ వేస్తారు. కాగా, ఉత్తరప్రదేశ్ వంటి చెరుకు ఎక్కువగా పండేంచే రాష్ట్రాల్లో రాబ్ బాగా ఫేమస్. ఇంకా పెన్సిల్ షార్ప్నర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి కౌన్సిల్ తగ్గించింది. కంటైనర్లలో వాడే ట్రాకింగ్ డివైజ్లపై జీఎస్టీని 18 శాతం నుంచి జీరో చేసింది. ‘పెండింగ్లో ఉన్న మొత్తం జీఎస్టీ కాంపెన్సేషన్ బకాయిలు ఇప్పటితో క్లియర్ అయిపోతాయని ప్రకటిస్తున్నాం. అంటే కిందటేడాది జూన్లో ఇవ్వాల్సిన రూ.16,982 కోట్లు క్లియర్ అయిపోతాయి’ అని సీతారామన్ అన్నారు. కాంపెన్సేషన్ ఫండ్లో ఈ అమౌంట్ లేకపోయినా, కేంద్రం తన సొంత రీసోర్స్ల నుంచి ఫండ్స్ రిలీజ్ చేయాలని నిర్ణయించుకుందని పేర్కొన్నారు. భవిష్యత్లో కాంపెన్సేషన్ సెస్ కింద సేకరించే ఫండ్స్ ఈ లాస్ను భర్తీ చేస్తాయని వివరించారు. జీఎస్టీ చట్టం కింద కేంద్ర ఇవ్వాల్సిన ఐదేళ్ల జీఎస్టీ కాంపెన్సేషన్ బకాయిలు క్లియర్ అయిపోయినట్టేనని అన్నారు.