
- రూ. 38,500 కోట్లతో మొదలుపెట్టి లక్షా పది వేల కోట్లకు పెంచారు
- కేసీఆర్ సహా 22 మందిపై చర్యలకు నివేదికలో ఘోష్ కమిషన్ సిఫార్సులు
- కాళేశ్వరం రిపోర్టుపై మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్
- తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంతో రూ.6 వేల కోట్లు నీళ్లలో పోసినట్లయింది
- కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రూ. 87,449.15 కోట్ల రుణాలు రాష్ట్రంపై గుదిబండ
- ప్రాణహిత-చేవెళ్ల వద్ద 75% డిపెండబిలిటీతో 205 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని చెప్పినా నాటి సర్కార్ పట్టించుకోలే
- మేడిగడ్డకు బదులు వేమనపల్లి వద్ద బ్యారేజీ కట్టాలంటూ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్టును దాచిపెట్టారు
- నిపుణుల కమిటీ రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకొని ఉంటే మేడిగడ్డ నిర్మాణం జరిగేది కాదు
- నివేదికలో స్పష్టం చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని, నాటి ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయాల వల్ల పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైందని జస్టిస్ ఘోష్ కమిషన్ నిగ్గుతేల్చింది. ప్రాజెక్టు రూపకల్పన నుంచి నిర్మాణం వరకు జరిగిన అనేక అవకతవకలు, ఆర్థిక అక్రమాలను తన నివేదికలో ప్రస్తావించింది. తుమ్మిడిహెట్టి వద్ద 75 శాతం డిపెండబిలిటీతో 205టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని సీడబ్ల్యూసీ చెప్పినా, ప్రాణహిత– చేవెళ్లకు హైడ్రాలజీ క్లియరెన్స్ఇస్తూ ప్రభుత్వానికి అప్పటి జలశక్తి మంత్రి ఉమాభారతి లేఖరాసినా నాటి సీఎం కేసీఆర్పట్టించుకోలేదని పేర్కొంది. ప్రాజెక్టు స్థలాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంతో రూ.6 వేల కోట్లు నీళ్లలో పోసినట్లయిందని కమిషన్అభిప్రాయపడింది. రూ. 38,500 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి, అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. లక్షా 10 వేల248 కోట్లకు పెంచారని, దీని వల్ల ఏజెన్సీలకు మేలు చేశారని తప్పుపట్టింది. కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రూ. 87,449.15 కోట్ల రుణాలు రాష్ట్రంపై గుదిబండగా మారాయని స్పష్టంచేసింది. నాటి ప్రభుత్వం వేసిన ఎక్స్పర్ట్స్ కమిటీ మేడిగడ్డకు బదులు వేమనపల్లి వద్ద బ్యారేజీ కట్టాలంటూ ఇచ్చిన రిపోర్టును కావాలనే అప్పటి పాలకులు దాచిపెట్టారని, ఒకవేళ ఆ రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకొని ఉంటే మేడిగడ్డ నిర్మాణం జరిగేది కాదని కమిషన్ అభిప్రాయపడింది. కేసీఆర్ కోరిక మేరకే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని స్పష్టంచేసింది. 665 పేజీల కాళేశ్వరం నివేదికను ఇరిగేషన్, జీఏడీ, లా సెక్రటరీలతో వేసిన కమిటీ అధ్యయనం చేసి, ఎగ్జిక్యూటివ్సమ్మరీని ప్రభుత్వానికి అందజేయగా... ఈ వివరాలను పవర్ పయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మీడియాకు వివరించారు.
అందులోని ముఖ్యాంశాలు..
డిజైనింగ్మొదలుకొని ఆపరేషన్ అండ్మెయింటెనెన్స్దాకా ప్రాజెక్టు ప్రతి దశలోనూ అక్రమాలు, ఆర్థిక అవకతవకలు జరిగాయి. ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వల్ల రూ. 6 వేల కోట్లు వృథా అయ్యాయి. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం వల్ల మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చామన్న నాటి ప్రభుత్వ వాదన ‘అసలు కారణం’ కాదు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం జరిగింది. టన్నెల్ లైనింగ్/ఫిల్లింగ్, భూసేకరణకు అదనంగా రూ. 1,500 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది.
ప్రాణహిత – -చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు 2014 అక్టోబర్ 24న సీడబ్ల్యూసీ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. అలాగే 75 శాతం డిపెండబిలిటీతో 205 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు చెప్పింది. ఆశ్చర్యకరంగా రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు 2014 నవంబర్ 24న సవరించిన హైడ్రలాజికల్ రిపోర్ట్ను సీడబ్ల్యూసీకి పంపించారు. కాగా, తుమ్మిడిహెట్టి వద్ద, మేడిగడ్డ వద్ద ఒకేరకమైన నీటి లభ్యత ఉందని 2015 మార్చి 4న, 2017 ఫిబ్రవరి 28న రెండుసార్లు సీడబ్ల్యూసీ లేఖలు రాసింది. ఈ రకంగా చూసినప్పుడు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం సాధ్యం కాదన్న కారణం మేడిగడ్డకు కూడా వర్తిస్తుంది.
నిపుణుల కమిటీ రిపోర్ట్ను కావాలనే తొక్కిపెట్టారు
రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో కూడిన ఒక నిపుణుల కమిటీ తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి లాభనష్టాలను వివరంగా పరిశీలించిందని కాళేశ్వరం కమిషన్ స్పష్టం చేసింది. ‘‘ఈ కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం సరికాదని, అది ఆర్థికంగా లాభదాయకం కాదని తేల్చి చెప్పింది. మేడిగడ్డ బదులుగా ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. నాటి ప్రభుత్వం ఈ నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు. నాటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో.. నిపుణులైన రిటైర్డ్ ఇంజనీర్ల సేవలను ప్రభుత్వం ఉపయోగించు కుందని చెప్పారు. దీన్ని బట్టి నివేదికను పరిగణనలోకి తీసుకోకపోవడం అనుకోకుండా జరిగి ఉండదు” అని కమిషన్ అభిప్రాయపడింది. ‘‘నిపుణుల కమిటీ నివేదికను 07.04.2015న ప్రభుత్వానికి సమర్పించిందని కానీ, ఆ నివేదికను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందో లేదో నాటి ఇరిగేషన్మంత్రి హరీశ్రావు కమిషన్కు చెప్పలేదు. అందువల్ల.. నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ నాటి మంత్రి హరీశ్రావు ఉద్దేశపూర్వకంగా ఈ నిపుణుల కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదు..’’ అని కమిషన్ నిర్ధారించింది. ఆ నివేదికను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినందుకు ఎస్.కె.జోషి, సి.మురళీధర్, బి.హరి రామ్ ను కమిషన్ బాధ్యులను చేసింది. భారీ ప్రజాధనం ఖర్చు చేసి మేడిగడ్డలో బ్యారేజీ నిర్మాణం చేపట్టడానికి నాటి సీఎం, నాటి ఇరిగేషన్ మంత్రికి వారు సహకరించారని తెలిపింది.
బాధ్యులు వీళ్లే..!
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అక్రమాలు, నిర్లక్ష్యం, పాలనా వైఫల్యాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫార్సు చేసింది. వీరిలో 22 మంది ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లు పేర్లను పేర్కొంది. మరికొందరి హోదాలను మాత్రం ప్రస్తావించింది.
ఆ 22 మంది ఎవరంటే..?
రాజకీయ నాయకులు: కె. చంద్రశేఖర్ రావు, టి. హరీశ్ రావు, ఈటల రాజేందర్
ఉన్నతాధికారులు: స్మితా సబర్వాల్, ఎస్.కె. జోషి, సి. మురళీధర్
ఇంజనీర్లు/అధికారులు: బి. హరిరామ్, ఎన్. వెంకటేశ్వర్లు, టి. శ్రీనివాస్, ఎ. నరేందర్ రెడ్డి, కె.ఎస్.ఎస్. చంద్రశేఖర్, బసవరాజు, జె. శ్రీదేవి, జి. రమేష్, జె. ఆశీర్వాదం, మేడిగడ్డ సబ్స్టాంటియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్ (సెప్టెంబరు 9, 2019) జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , మేడిగడ్డ సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ (మార్చి 15, 2021) జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మేడిగడ్డ సబ్స్టాంటియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్ సూపరింటెండింగ్ ఇంజనీర్, మేడిగడ్డ సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ సూపరింటెండింగ్ ఇంజనీర్, మేడిగడ్డ సర్టిఫికెట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్స్ చీఫ్ ఇంజనీర్, అన్నారం బ్యారేజీ సర్టిఫికెట్ జారీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సుందిళ్ల బ్యారేజీ సర్టిఫికెట్ జారీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.
ఇతర అధికారులు/ఇంజనీర్లు:
ఫైనాన్స్ కార్యదర్శులు: జీవో నెంబర్లు 231, 232, 233 జారీలో పాల్గొన్నవారు.
ఇరిగేషన్ కార్యదర్శులు: పరిపాలనా ఆమోదాలు, కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలలో ఉల్లంఘనలకు బాధ్యులు.
కేఐపీసీఎల్ బోర్డు సభ్యులు: రుణాల సేకరణ, చెక్కుల జారీ, అక్రమ నిర్ణయాల ఆమోదంలో పాల్గొన్నవారు.
సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) సభ్యులు: తప్పుడు డిజైన్లు, నిర్మాణ లోపాలకు బాధ్యులు.
నాణ్యత నియంత్రణ, నిర్మాణ పర్యవేక్షణ ఇంజనీర్లు: కాంక్రీట్ శాంపిల్స్ పరీక్షలలో నిర్లక్ష్యం, సెకంట్ పైల్స్ తనిఖీలలో లోపాలు.
స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎసీ) సభ్యులు: సవరించిన అంచనాలు, తప్పుడు సాంకేతిక సమర్థనలకు బాధ్యులు.