బదిలీపై కర్నాటక హైకోర్టుకు వెళ్తున్నజస్టిస్‌ శ్రీసుధకు ఘన వీడ్కోలు

బదిలీపై కర్నాటక హైకోర్టుకు వెళ్తున్నజస్టిస్‌ శ్రీసుధకు ఘన వీడ్కోలు

హైదరాబాద్, వెలుగు: బదిలీపై కర్నాటక హైకోర్టుకు వెళ్తున్న తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్‌ పి.శ్రీసుధకు హైకోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు చెప్పింది. యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజయ్​పాల్‌ అధ్యక్షతన ఫుల్‌ కోర్టు సమావేశమై ఆమెకు వీడ్కోలు పలికింది. న్యాయమూర్తిగా జస్టిస్‌ పి.శ్రీసుధ 5,055 కేసులను పరిష్కరించారని.. ఎక్కువగా ఫ్యామిలీ వివాద కేసులు ఉన్నాయని జస్టిస్‌ సుజయ్‌పాల్‌ చెప్పారు.  జస్టిస్‌ శ్రీసుధ మాట్లాడుతూ.. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు సహా పలు ప్రధాన కేసుల తీర్పుల విచారణ, తీర్పులో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు.

కార్యక్రమంలో ఏజీ సుదర్శన్‌ రెడ్డి, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ నర్సింహ శర్మ, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ప్రవీణ్‌కుమార్, హైకోర్టు అడ్వకేట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ కూడా ఆమెను సత్కరించింది. జస్టిస్‌ శ్రీసుధను కర్నాటకకు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను కేంద్రం ఇటీవల ఆమోదించింది.