- తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్
హైదరాబాద్, వెలుగు : విద్యుత్ సంస్థల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడిందని తెలంగాణ విద్యుత్ వర్కర్స్ యూనియన్ తెలిపింది. కొత్త ప్రభుత్వం రావడం వల్లే తమకు న్యాయం జరిగిందని పేర్కొంది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంబో నాగరాజు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో అన్యాయాన్ని ప్రశ్నిస్తే అప్పటి డిస్కం సీఎండీ తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు తమ యూనియన్ ఆఫీసును స్వాధీనం చేసుకున్నారని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ వర్కర్స్యూనియన్ పై కక్ష కట్టిందన్నారు. విద్యుత్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కంకణం కట్టుకుని.. విద్యుత్ సంస్థల యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తే కక్షసాధింపులకు పాల్పడిందని ఆరోపించారు. సస్పెన్షన్ విధించినా, యూనియన్ రాష్ట్ర కార్యాలయాన్ని సీజ్ చేసినా, వెనుకడుగు వేయకుండా అలుపెరగని పోరాటం చేశామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసిందని, యూనియన్ రాష్ట్ర కార్యాలయాన్ని అధికారికంగా తిరిగి తెరిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిస్కం సీఎండీ ముషారఫ్ ఆలీ పారుఖికి, సహకరించిన అధికారులకు నాగరాజు ధన్యవాదాలు తెలిపారు.
