
నాన్జింగ్ (చైనా): ఇండియా ఆర్చరీ స్టార్, తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ టోర్నమెంట్ కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం అందుకొని ఈ ఘనత సాధించిన ఇండియా తొలి మహిళగా రికార్డుకెక్కింది. ఆసియా గేమ్స్ చాంపియన్ అయిన జ్యోతి శనివారం జరిగిన కాంస్య పతక పోరులో 150–145 తేడాతో వరల్డ్ రెండో ర్యాంకర్, గ్రేట్ బ్రిటన్కు చెందిన ఎల్లా గిబ్సన్ను ఓడించింది. ఈ పోరులో సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన 29 ఏండ్ల జ్యోతి మొత్తం ఐదు రౌండ్లలో వేసిన 15 బాణాలకు పర్ఫెక్ట్ 10 పాయింట్ల రాబట్టడం (150/150) విశేషం.
అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో 143–-140తో అమెరికా ఆర్చర్ అలెక్సిస్ రూయిజ్పై గెలిచి సెమీస్కు దూసుకెళ్లింది. అయితే సెమీస్లో వరల్డ్ నంబర్ వన్ ఆండ్రియా బెకెర్రా (మెక్సికో) అడ్డును దాటలేకపోయింది. హోరాహోరీ పోరులో జ్యోతి 143–-145 తేడాతో ఓడి గోల్డ్ మెడల్ మ్యాచ్కు దూరమై కాంస్యం కోసం పోటీ పడాల్సి వచ్చింది. 2022, 2023 ఎడిషన్లలో తొలి రౌండ్లలోనే నిష్క్రమించిన జ్యోతి తన మూడో ప్రయత్నంలో వరల్డ్ కప్ మెడల్ అందుకుంది. మధుర ధామంగావ్కర్ తొలి రౌండ్లోనే ఓడి నిరాశపరచగా.. మెన్స్ కాంపౌండ్లో రిషబ్ యాదవ్ తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. నెదర్లాండ్స్కు చెందిన మాజీ వరల్డ్ చాంపియన్ మైక్ స్ల్కోసర్తో కాంస్య పతకం కోసం పోటీ పడ్డ రిషబ్ నిర్ణీత ఐదు రౌండ్లు ముగిసేసరికి 147–-147, పాయింట్లతో సమంగా నిలిచాడు. షూటాఫ్లోనూ ఇద్దరూ పర్ఫెక్ట్ టెన్ పాయింట్లు సాధించారు. అయితే, స్ల్కోసర్ బాణం మిల్లీమీటర్ల తేడాతో సెంటర్కు అత్యంత సమీపంగా ఉండటంతో అంపైర్లు అతడినే విజేతగా ప్రకటించగా.. రిషబ్ తీవ్ర నిరాశతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.