దేశాన్ని అమెరికాకు అమ్మింది సోనియానే !!

దేశాన్ని అమెరికాకు అమ్మింది సోనియానే !!

మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు 2వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ ఆరోపించారు. తాను ఆ స్థానంలో ఉండి ఉంటే.. ఒక్క ఇంచు కూడా చైనా లోపలికి చొచ్చుకు రాలేకపోయేదన్నారు. మూడు రోజుల్లో చైనా బార్డర్ అంతా ఆక్రమించి ఉండేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం ఏర్పాటుచేసిన ప్రెసెమీట్ లో పాల్ మాట్లాడారు. ఇవన్నీ చూసి చూసి.. భారత దేశాన్ని రక్షించుకునే దృఢ సంకల్పంతో తాను రాజకీయాల్లో క్రియాశీలంగా మారానని చెప్పారు. తనకు ప్రజలు అవకాశమిస్తే.. కేవలం 10 సంవత్సరాల్లో చైనాను బలహీనం చేసే ప్లాన్ తన వద్ద ఉందన్నారు. ‘‘ చైనా తన బడ్జెట్ కు మించి.. 70 దేశాలకు అప్పులు ఇచ్చింది.  ఆ దేశాలు అప్పులు తిరిగి ఇవ్వకుంటే చైనా పనైపోతుంది.  చాలా దేశాల అధ్యక్షులు నాతో మాట్లాడారు. కరోనాతో ఇబ్బందులలో ఉన్నాం. ఇక చైనాకు అప్పులు తిరిగి కట్టే పరిస్థితి లేదని చెప్పారు. అలాగే చేయమని నేను వాళ్లకు చెప్పాను. అప్పు మళ్లీ కట్టలేమని  కెన్యా, జింబాబ్వే, శ్రీలంక వాళ్లతో చైనాకు చెప్పించాను’’అని కె.ఎ.పాల్ వ్యాఖ్యానించారు. కరోనాతో చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి మనదేశంలో రూ.75 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి మల్లారెడ్డి, రైతు నేత రాకేశ్ టికాయత్ లపై జరిగిన దాడులను ఆయన ఖండించారు.  

మా పార్టీ వెబ్ సైట్ క్రాష్ అవుతోంది 

‘‘ కాంగ్రెస్ ఎప్పుడో భూ స్థాపితమైంది. బీజేపీ అన్ని రకాలుగా పాలనలో విఫలమైంది. సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదు, భారత దేశ ద్రోహి. ఇండియాను అమెరికా కు అమ్మేసింది సోనియాగాంధే. కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో ఒక్క స్థానం కూడా గెలవదు. రేవంత్ రెడ్డి కి ఉన్నపాటి ఇమేజ్ కాంగ్రెస్ కు కూడా లేదు.రాజ్యసభ సీట్ల కోసం 500 కోట్లు తీసుకున్నవాళ్లు, ఇచ్చినవాళ్ళు మన హైదరాబాద్ లోనే ఉన్నారు’’అని పాల్ కామెంట్ చేశారు. ‘‘ప్రజాశాంతి పార్టీ వెబ్ సైట్ క్రాష్ అయ్యేంతగా ప్రజల నుంచి స్పందన వస్తోంది. సభ్యత్వ నమోదు పెద్దఎత్తున లక్షల్లో జరుగుతోంది. తెలంగాణ ఐటీ మంత్రి దాన్ని ఏమైనా క్రాష్ చేయిస్తున్నారో విచారణ చేయించాలి. జూన్ 1 నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మా పార్టీ తరఫున తిరుగుతా’’అని చెప్పారు. 

మరిన్ని వార్తలు..

బాబాయి అబ్బాయి సినిమా షూటింగ్ పూర్తి

మాదాపూర్లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ