మునుగోడు బైపోల్ లో కేఏ పాల్ ప్రచారం

మునుగోడు బైపోల్ లో కేఏ పాల్ ప్రచారం

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడు మండల కేంద్రంలో చెప్పులు కుడుతూ వినూత్న ప్రచారం నిర్వహించారు. ‘‘ అమెరికాలో చెప్పులు కుట్టిన అబ్రహం లింకన్ అధ్యక్షుడు అయ్యాడు. అది అమెరికా గొప్పతనం. కానీ మనదేశంలో ఇది సాధ్యమా’’ అంటూ కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు. చెప్పులు కుట్టుకుని బతికే వారికి రోజుకి 300 రూపాయలు కూడా రావడం లేదు.. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు.  

పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరూ మహారాజులు కాలేరని.. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చినప్పుడే మహారాజులు అవుతామని కేఏ పాల్ అన్నారు. మాదిగల కష్టాలు తనకు తెలుసని, అందుకే మార్పు తీసుకురావడానికి వచ్చానంటూ చెప్పుకొచ్చారు. మార్పు రావాలంటే కేఏ పాల్ రావాలని.. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాంటూ ఓటర్లను అభ్యర్థించారు.  టీఆర్ఎస్, బీజేపీ గుండాలు అడుగడుగునా తన ప్రచారాన్ని అడ్డుకుని.. తన పై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ వేల కోట్లు వృధా చేస్తున్నారంటూ కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు.