
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నిర్మల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు రోడ్లు, కాలనీలు నదులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లల్లోకి భారీగా వరద వచ్చి చేరింది.
గత మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆగస్టు 16న ఇన్ ఫ్లోగా ప్రాజెక్టులోకి లక్షా 95వేల 923 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో అన్ని 18 గేట్లు ఎత్తి 2లక్షల14 వేల 730 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు అధికారులు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు, 4.699 టీఎంసీలు . ప్రస్తుతం 693.850 అడుగులు కాగా 3.257 టీఎంసీలలో నీటి సామర్థ్యం కొనసాగుతుంది.
►ALSO READ | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద..24గేట్లు ఓపెన్
కడెం ప్రాజెక్టుకు భారీ వరద నీరు రావడంతో ప్రాజెక్టును సందర్శించారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. మొత్తం గేట్లు ఓపెన్ చేయడంతో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇందులో ఆదిలాబాద్, కొమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల,మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లా,ములుగు ఉన్నాయి.