- విశాక స్పాన్నర్గా నిర్వహిస్తున్న హెచ్సీఏ
- రెండు దశల్లో మెగా టోర్నీ
- తొలి ఫేజ్లో 29 జిల్లాల జట్ల పోటీ
హైదరాబాద్/ మహబూబ్నగర్ వెలుగు: తెలంగాణ పల్లెల్లో దాగివున్న క్రికెట్ ప్రతిభను వెలికితీసేందుకు అద్భుత వేదిక సిద్ధమైంది. విశాక ఇండస్ట్రీస్ స్పాన్సర్గా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్వహించే కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ20 లీగ్కు వేళయింది. ఈ మెగా టోర్నమెంట్ తొలి అంచె పోటీలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (ఎండీసీఏ) క్రికెట్ గ్రౌండ్లో జరిగే ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహ, రాష్ర్ట ప్రభుత్వ క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, శాట్జ్ చైర్మన్ శివసేనారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై టోర్నీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలి మ్యాచ్లో ఆతిథ్య మహబూబ్నగర్ జట్టుతో నాగర్ కర్నూల్ తలపడనుంది. ఆదివారం ఎంసీఏ స్టేడియాన్ని ఎస్పీ డి.జానకి పరిశీలించారు. ఎండీసీఏ సెక్రటరీ రాజశేఖర్ నేతృత్వంలో ఆరంభ మ్యాచ్కు పిచ్, గ్రౌండ్ సిద్ధం చేశారు. ఈ మెగా టోర్నమెంట్ను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు.
ఈ నెల 27 వరకు జరిగే తొలి ఫేజ్లో హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్రంలోని మిగిలిన 29 జిల్లాల జట్లు పోటీ పడుతున్నాయి. వీటిని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 8 జోన్లుగా (వరంగల్, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, మెదక్) విభజించారు. రౌండ్ రాబిన్, ఫైనల్ పద్ధతిలో ఆయా జిల్లా కేంద్రాల్లోనే ఈ మ్యాచ్లు జరుగుతాయి. జోనల్ విజేతలుగా నిలిచిన 8 జట్లు రెండో దశ అయిన స్టేట్ లెవెల్ లీగ్కు అర్హత సాధిస్తాయి. ఈ నెల 29 నుంచి జరిగే సెకండ్ ఫేజ్లో ఈ 8 జట్లు హైదరాబాద్, రంగారెడ్డి జట్లతో కలిపి మొత్తం 49 మ్యాచ్ల్లో తలపడతాయి. యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు విశాక ఈ టోర్నీలో భారీగా నగదు బహుమతులను ప్రకటించింది. ఓవరాల్ విన్నర్గా నిలిచే జట్టుకు రూ. 5 లక్షలు, రన్నరప్కు రూ. 3 లక్షలు అందజేస్తారు.
