బ్యారేజీల్లో నీళ్లు నింపాలని ఆదేశాలిచ్చింది కేసీఆరే: కాళేశ్వరం కమిషన్

బ్యారేజీల్లో నీళ్లు నింపాలని  ఆదేశాలిచ్చింది కేసీఆరే: కాళేశ్వరం కమిషన్

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నుంచి.. కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్నీ కేసీఆర్​ కనుసన్నల్లోనే నడిచాయని కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ తేల్చింది. ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ ఆయన జోక్యం చేసుకున్నారని పేర్కొంది. కేబినెట్​లో చర్చించకుండానే.. సరైన ఫైళ్లు లేకుండానే ప్రాజెక్టు పనులను చేయించారని తెలిపింది. డీపీఆర్​ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని ఆక్షేపించింది. బ్యారేజీ సైట్​ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడంపైనా ఆయనే నిర్ణయం తీసుకున్నారని తేల్చిచెప్పింది. కేసీఆర్​ నిర్ణయాలే చివరికి బ్యారేజీల ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయని, ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అసలు దోషి ఆయనేనని కమిషన్​ తన నివేదికలో స్పష్టం చేసింది. 

నీళ్లు నింపాలన్నదీ కేసీఆరే..

బ్యారేజీల్లో నీళ్లు నింపాలని ఆదేశాలిచ్చింది కూడా అప్పటి సీఎం కేసీఆరేనని కమిషన్​ నివేదిక తేల్చిచెప్పింది. బ్యారేజీలను నీటిని మళ్లించేందుకే వాడాల్సి ఉన్నా.. నీటిని పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నింపారని స్పష్టం చేసింది. ఇలా నీళ్లను నింపడంతోనే బ్యారేజీలకు పెను ప్రమాదం ఏర్పడిందని తేల్చింది. బ్యారేజీలను నిర్మించినప్పటి నుంచీ ఆపరేషన్స్​ అండ్​ మెయింటెనెన్స్​ (ఓ అండ్​ ఎం)ను చేపట్టలేదని, పూర్తి నిర్లక్ష్యం చేశారని కమిషన్​ నివేదిక తేల్చింది.

►ALSO READ | కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రకారం వీళ్లంతా బాధ్యులే..

 కాలానుగుణంగా పరీక్షలు చేయలేదని, వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత చేయాల్సిన ఇన్​స్పెక్షన్లు చేయలేదని, నివేదికలు ఇవ్వలేదని పేర్కొంది. వాస్తవానికి బ్యారేజీలను ఫ్లోటింగ్​ స్ట్రక్చర్లుగా (తేలియాడే నిర్మాణం) డిజైన్​ చేసినప్పటికీ.. నీటిని స్టోర్​ చేసే వాటిగా కట్టారని, అది ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లను మార్చాక అక్కడ బ్యాక్ వాటర్​ స్టడీస్​, టెయిల్​ వాటర్​ రేటింగ్​ కర్వ్స్​, జీడీ కర్వ్స్​, జియోఫిజికల్​ ఇన్వెస్టిగేషన్స్​ను చేయలేదని తెలిపింది. నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని స్పష్టం చేసింది. సీకెంట్​ పైల్స్​ వంటి నిర్మాణాలను చేపట్టేటప్పుడు నాణ్యతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాల్సి ఉన్నా.. పట్టింపులేనట్టుగానే వ్యవహరించినట్టు ఉందని తెలిపింది. సరైన కొలతలు లేకుండానే వర్చువల్​గానే వాటి నిర్మాణాన్ని ఓకే చేశారని తెలిపింది.