
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నుంచి.. కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్నీ కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచాయని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ తేల్చింది. ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ ఆయన జోక్యం చేసుకున్నారని పేర్కొంది. కేబినెట్లో చర్చించకుండానే.. సరైన ఫైళ్లు లేకుండానే ప్రాజెక్టు పనులను చేయించారని తెలిపింది. డీపీఆర్ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని ఆక్షేపించింది. బ్యారేజీ సైట్ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది.
బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడంపైనా ఆయనే నిర్ణయం తీసుకున్నారని తేల్చిచెప్పింది. కేసీఆర్ నిర్ణయాలే చివరికి బ్యారేజీల ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయని, ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అసలు దోషి ఆయనేనని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు వైఫల్యాలకు నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా బాధ్యులేనని తేల్చిచెప్పింది. ఆర్థికాంశాల్లో అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఈటల రాజేందర్ బాధ్యతగా వ్యవహరించలేదని తెలిపింది. అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ పనితీరునూ తప్పుబట్టింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థలు ఎల్ అండ్టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థలూ బ్యారేజీలు విఫలమవడంలో ప్రధాన కారణమని కమిషన్ తేల్చి చెప్పింది.
కమిషన్ నివేదిక ప్రకారం వీళ్లంతా బాధ్యులే..
కేసీఆర్: ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల ప్లానింగ్, నిర్మాణం, కంప్లీషన్, ఓ అండ్ ఎంలలో అవకతవకలు, అక్రమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అప్పటి సీఎం కేసీఆరే బాధ్యుడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాల వల్లే మూడు బ్యారేజీలకు ఇప్పుడీ దుస్థితి ఏర్పడింది.
హరీశ్ రావు: అప్పటి సీఎం కేసీఆర్తో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు కూడా ఉద్దేశపూర్వకంగానే ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు.
ఈటల రాజేందర్: కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్పై ఉన్నా.. ఆయనలో ఆ కమిట్మెంట్ లోపించింది. ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాలపై సరిగ్గా దృష్టి సారించలేదు. కాళేశ్వరం కార్పొరేషన్ బోర్డులో ఆర్థిక శాఖ కూడా భాగమైనా అది తమ బాధ్యత కాదని తప్పించుకున్నారు.
ఎస్కే జోషి: అప్పట్లో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సీఎస్గా ఉన్న ఈయన ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. పరిపాలనకు సంబంధించి బిజినెస్ రూల్స్ను ఉల్లంఘించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఫెయిల్యూర్కు బాధ్యుడు.
స్మితా సబర్వాల్: అప్పటి సీఎంవో సెక్రటరీగా స్మితా సబర్వాల్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదు. కేబినెట్ అనుమతులకు సంబంధించి బిజినెస్ రూల్స్ ప్రకారం నడుచుకోలేదు.
మురళీధర్రావు: ఈఎన్సీగా విధుల్లో ఉన్న ఈయన సెంట్రల్ వాటర్ కమిషన్కు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను దాచేశారు. దురుద్దేశపూర్వకంగా అంచనాలను పెంచారు. ఓ అండ్ఎంలో ఫెయిలయ్యారు.
బి.హరిరాం: ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు సీఈగా సీడబ్ల్యూసీకి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ అయి ఉండి కూడా బ్యారేజీల సంగతి తనకు తెలియదంటూ చెప్పారు.
బ్యారేజీల నిర్మాణంలో కాళేశ్వరం సీఈ ఎన్. వెంకటేశ్వర్లు, రామగుండం సీఈ కొట్టె సుధాకర్ రెడ్డి, ఈఈ ఓంకార్ సింగ్, ఇతర అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
బి. నాగేందర్ రావు: అప్పట్లో ఈఎన్సీ (ఓ అండ్ ఎం)గా ఉన్న ఈయన 2021 జనవరి 1 నుంచి బ్యారేజీల ఓ అండ్ ఎంను పట్టించుకోవడంలో విఫలమయ్యారు. బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి ఇతరులపైకి నెపాన్ని మోపే ప్రయత్నం చేశారు. మూడు బ్యారేజీలు డ్యామేజ్ అవ్వడానికి కారణమయ్యారు.
టి. ప్రమీల: స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సీఈగా ఆమె తన విధులను నిర్లక్ష్యం చేశారు. బ్యారేజీలను ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్, డ్యామ్ సేఫ్టీ డ్యూటీలు చేయడంలో విఫలమయ్యారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం పనిచేయలేదు.
నరేందర్ రెడ్డి (సీఈ సీడీవో), కేఎస్ఎస్ చంద్రశేఖర్ (ఎస్ఈ సీడీవో), బసవరాజు (ఈఈ సీడీవో), టి. శ్రీనివాస్ (సీఈ)లు కమిషన్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. నిజాలు దాచారు. వీరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.
శ్రీదేవి (సీఈ ఈఆర్ఎల్): ప్రమాణాలకు తగ్గట్టు మోడల్ స్టడీస్ నిర్వహించలేదు.
అనిల్ కుమార్: అప్పట్లో ఈఎన్సీగా పనిచేసిన ఈయన.. ఆదేశాలను కాదని తన సొంత నిర్ణయాలు తీసుకున్నారు.