
కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. రేపటితో కమిషన్ గడువు ముగుస్తుండటంతో ఆగస్టు 31 వరకు పొడిగించింది. కమిషన్ ముందు విచారణకు హాజరైన ప్రాజెక్టుకు సంబంధించిన మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. దీంతో గురువారం వరకు 60 మంది సీల్డ్ కవర్లలో అఫిడవిట్లు దాఖలు చేసినట్లు తెలిసింది.