- మరో 3,548 కోట్ల ఎస్టిమేషన్లకు కేబినెట్ ఆమోదం
- పెరిగిన అనంతగిరి, రంగనాయకసాగర్, తడ్కపల్లి రిజర్వాయర్ పనుల అంచనాలు
- ఇప్పటికే మేడిగడ్డ ‑ ఎల్లంపల్లి లింక్1,
- ఎల్లంపల్లి‑ మిడ్ మానేరు లింక్ 2 వ్యయం పెంపు
- మొత్తంగా రూ. 11,765 కోట్లు పెరిగిన ఖర్చు
- రూ. 92,105 కోట్లకు ప్రాజెక్టు అంచనా వ్యయం
- అడిషనల్ టీఎంసీతో ఖర్చు 1.2 లక్షల కోట్లకు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఇంకో రూ. 3,548 కోట్లు పెంచారు. గతంలో పెంచిన ప్యాకేజీలతో పాటు తాజా ప్రతిపాదనలకు ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదముద్ర వేశారు. ఇదివరకు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు లింక్-1, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు లింక్- 2లోని పనుల ఎస్టిమేట్లు భారీగా పెంచారు. ఇప్పుడు అనంతగిరి, రంగనాయకసాగర్, తడ్కపల్లి రిజర్వాయర్ సహా ఇతర పనుల ఎస్టిమేట్లు పెంచారు. తాజా పెంపుతో కలిపి మొత్తంగా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 11,765 కోట్లు పెరిగింది.
మేడిగడ్డకు మార్చి..
ఉమ్మడి ఏపీలో 2007–08 ఆర్థిక సంవత్సరంలో రూ. 38,500 కోట్లతో మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఏర్పడ్డాక కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. తమ్మిడిహెట్టి నుంచి వంద కిలోమీటర్ల దిగువన మేడిగడ్డకు మార్చి అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోయడానికి 3 బ్యారేజీలు, పంపుహౌస్లు నిర్మించారు. ఈ మార్పుతోనే ప్రాజెక్టు ఖర్చు భారీగా పెరిగింది. ఎల్లంపల్లి తర్వాత ప్రాజెక్టు స్వరూపంలో పెద్దగా మార్పు లేకున్నా రిజర్వాయర్ల సామర్థ్యం భారీగా పెంచడంతో అంచనా వ్యయం పెరిగింది. దీంతో 2015–16లో రూ.80.190.46 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు.
ప్యాకేజీ 10, 11, 12 అంచనాలు పెంపు
మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మసాగర్ వరకు నీళ్లు తరలించే 10, 11, 12 ప్యాకేజీల అంచనా వ్యయాలు ఇప్పుడు పెంచారు. అనంతగిరి రిజర్వాయర్, నీళ్లు తరలించే గ్రావిటీ కెనాల్, టన్నెల్ వ్యయాన్ని రూ. 3,031.39 కోట్ల నుంచి రూ. 4,404.65 కోట్లకు పెంచారు. అనంతగిరి నుంచి రంగనాయకసాగర్ వరకు పంపుహౌస్, కాలువ, టన్నెల్ వ్యయాన్ని రూ. 3,433.78 కోట్ల నుంచి రూ. 4,491.50 కోట్లకు పెంచారు. తడ్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం, నీళ్లు తరలించే వ్యవస్థ ఎస్టిమేట్లను రూ. 3,616.41 కోట్ల నుంచి రూ. 4,734 కోట్లకు పెంచారు. మొత్తంగా లింక్ -4లోని మూడు ప్యాకేజీల్లో కలిపి రూ.3,548.26 కోట్లకు పెంచారు. ఇదివరకే ప్రతిపాదించిన ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తరలించే గ్రావిటీ కాలువలు, టన్నెళ్లు, రెండు పంపుహౌస్ల రివైజ్డ్ ఎస్టిమేట్లకు ఆమోదముద్ర వేశారు.
ఇప్పటికే రూ. 75 వేల కోట్లు ఖర్చు
తాజా పెంపుతో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 92,105.70 కోట్లకు చేరింది. అదనపు టీఎంసీ పనులను కలుపుకుంటే మొత్తం ఖర్చు రూ.1.20 లక్షల కోట్లకు చేరనుంది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.75 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టులో కీలకమైన మల్లన్నసాగర్ నిర్మాణ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయి. దీనితో పాటు కొండపోచమ్మసాగర్ వరకు ఉన్న ప్యాకేజీల రివైజ్డ్ ఎస్టిమేట్లు సిద్ధమవుతున్నాయి. వాటితో పాటు పైపులైన్లు వేస్తున్న ప్యాకేజీ -21 ఖర్చు భారీగా పెరనున్నట్టు సమాచారం. రానున్న కొన్ని నెలల్లోనే ప్రాజెక్టు అంచనా వ్యయం మళ్లీ పెరగడం ఖాయమని తెలుస్తోంది.
అంచనా వ్యయం పెంపు ఇలా.. (రూ. కోట్లలో)
ప్యాకేజీ మొదటి అంచనా సవరించిన పెంపు
వ్యయం వ్యయం
మేడిగడ్డ బ్యారేజీ 2,591 4,583 1,992
అన్నారం బ్యారేజీ 1,785 2,795 1,010
ప్యాకేజీ - 6 4,004 6,907 2,903
ప్యాకేజీ - 7 1,502 2,083 581
ప్యాకేజీ - 8 5,166 6,897 1,731
ప్యాకేజీ - 10 3,031 4,404 1,373
ప్యాకేజీ - 11 3,433 4,491 1,057
ప్యాకేజీ - 12 3,616 4,734 1,118
మొత్తం 25,128 36,894 11,765