కాళేశ్వరం వైఫల్యానికి కేసీఆర్, హరీశ్ రావే కారణం : మంత్రి ఉత్తమ్​

కాళేశ్వరం వైఫల్యానికి  కేసీఆర్, హరీశ్ రావే కారణం : మంత్రి ఉత్తమ్​
  • నాసిరకం పనులు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారు: మంత్రి ఉత్తమ్​
  • ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి ఎదురు దాడికి దిగుతరా?
  • కేసీఆర్​ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బ్యారేజీలే సాక్ష్యం
  • ఫరక్కా బ్యారేజీని నీటి మళ్లింపునకు కడితే..  కాళేశ్వరాన్ని నిధుల మళ్లింపునకు కట్టారు
  • కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల పథకం
  • హరీశ్​రావు పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​పై మంత్రి కౌంటర్​

హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టుల నిర్మాణంలో బీఆర్ఎస్​ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, కమీషన్ల కక్కుర్తితో తెలంగాణకు శాశ్వత నష్టం జరిగిందని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీ వైఫల్యానికి ప్రధాన కారకులు కేసీఆర్​, హరీశ్​ రావేనని అన్నారు. 2018 దాకా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్​రావు.. నాసిరకం పనులు చేపట్టి, ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు ప్రజలకు బేషరతులుగా క్షమాపణలు చెప్పాల్సిందిపోయి ఎదురుదాడికి దిగడమేందని ప్రశ్నించారు. 

వారి కమీషన్ల కక్కుర్తికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని అన్నారు. కేసీఆర్​ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బ్యారేజీలే ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. ఐదేండ్లలో మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎత్తిపోసిన నీళ్లు కేవలం 162 టీఎంసీలేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్​రావు ఇచ్చిన పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​పై మంత్రి ఉత్తమ్​ శనివారం కౌంటర్​ ఇచ్చారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అని చెప్పింది మీరే. ఆ బ్యారేజీ నుంచి ఎత్తిపోసిన నీళ్లనే కాళేశ్వరం నీళ్లుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 

2019–2020లో 61 టీఎంసీలు, 2020–2021లో 31.82 టీఎంసీలు, 2021–22లో 33 టీఎంసీలు, 2022–23లో 25.97 టీఎంసీలు, 2023–24లో 8.93 టీఎంసీలు ఎత్తిపోశారు. ఆ మొత్తం కలిపితే 162 టీఎంసీలే మేడిగడ్డ నుంచి ఎత్తిపోసినట్టు. అందులో వరదలొచ్చాక మళ్లీ సముద్రంలోకి వదిలిన నీళ్లు 63 టీఎంసీలు. అలాంటప్పుడు ఐదేండ్లలో 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లా ఇచ్చారు?’’ అని మంత్రి ఉత్తమ్​ ప్రశ్నించారు.  

మోటార్లన్నీ నాశనం

2022 జులైలో వరదలకు సిరిపురం (అన్నారం) పంప్ హౌస్ నీట మునిగిందని, అదే ఏడాది కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్ హౌస్  బ్రెస్ట్ వాల్ కూలి... పంప్ హౌస్​లోని మోటార్లన్నీ నాశనమయ్యాయని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. ఆ ఏడాది 25 టీఎంసీలే ఎత్తిపోశారని చెప్పారు. ‘‘2023 అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. 1975 లో ఫరక్కా బ్యారేజీ కట్టినా.. ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రతిపాదించింది బీఆర్ఎస్ హయాంలోనే. 

నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. మేడిగడ్డ కుంగింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే. ఫరక్కా బ్యారేజీని నీటి మళ్లింపు కోసం కడితే.. కాళేశ్వరం బ్యారేజీలు కట్టింది నిధుల మళ్లింపు కోసం. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కడతామని మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని ఏనుగులతో ర్యాలీలు తీయలేదా? తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి దాకా నీటిని గ్రావిటీతో తరలించడానికి 100 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ నిర్మాణం పూర్తయింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కడితే 100 కిలోమీటర్ల దాకా గ్రావిటీతో నీళ్లు వచ్చేవి. మేడిగడ్డ వల్ల 100 కిలోమీటర్ల కిందికి వెళ్లి... నీటిని ఎత్తిపోయడం.. వరదలు రాగానే మళ్లీ నీటిని సముద్రంలోకి వదిలేయడం. అది కాళేశ్వరం ఎత్తిపోతల కాదు.. తిప్పిపోతల పథకం’’ అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్​కు పేరు రావొద్దనే ప్రాజెక్ట్​ లొకేషన్​ మార్పు

శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, లోయర్ మానేరు, అప్పర్ మానేరు, సింగూరు రిజర్వాయర్లను బీఆర్​ఎస్​ కట్టలేదని, కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో నిర్మించారని మంత్రి ఉత్తమ్​ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత–-చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.6,156 కోట్లను ఖర్చు చేశారని తెలిపారు. 2016 నాటికి రూ.11,679 కోట్లను ఖర్చు చేశారని చెప్పారు. ‘‘తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని ఏ రోజు కూడా సీడబ్ల్యూసీ చెప్పలేదు. ఇది పచ్చి అబద్ధం. పైసల కక్కుర్తి కోసమే, గత కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావొద్దనే కారణాలతోనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారు. 

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే రూ38 వేల కోట్లతో పూర్తై.. ఇప్పటికే తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల దాకా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందేది. మీ కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న అప్పులకు తెలంగాణ ప్రజలు ఏటా రూ.16 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తున్నది. మీరు కట్టిన కాళేశ్వరం అన్ని పంపులు నడిచినప్పుడు విద్యుత్ భారమే ఏడాదికి రూ.10 వేల కోట్లు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే.. విద్యుత్ భారం కేవలం రూ.వెయ్యి కోట్లే’’ అని చెప్పారు.  

తప్పుడు ప్రచారం మానండి: హరీశ్​

అబద్ధాల ప్రవాహాన్ని మంత్రి ఉత్తమ్​ ఆపాలని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు ఫైర్​ అయ్యారు. కాళేశ్వరంపై చేస్తున్నది దుష్ప్రచారమని ఆధారాలతోసహా బయటపెట్టినా మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. ఉత్తమ్​ వ్యాఖ్యలకు హరీశ్​రావు కౌంటర్​ ఇచ్చారు.

 ‘‘ఐదేండ్లలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసింది 162 టీఎంసీలేనని చెబుతున్న మీరు.. కాళేశ్వరంలో భాగమైన ఎల్లంపల్లి నుంచి మిడ్​మానేరుకు లిఫ్ట్​ చేసింది ఎందుకు చెప్పరు? కాళేశ్వరం కట్టిన మూడేండ్లలోనే 2022–23 వరకే మేడిగడ్డ నుంచి 162.41 టీఎంసీలు, అన్నారం నుంచి 172.86 టీఎంసీలు, సుందిళ్ల నుంచి 172.12 టీఎంసీలు, నంది మేడారం పంప్ హౌజ్ నుంచి 181.70 టీఎంసీలు, గాయత్రి పంప్ హౌజ్ నుంచి 179.41 టీఎంసీల గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తి పోసినం. ఇది వాస్తవం. మీకు తెలియకుంటే మీ ఇంజినీర్లను అడిగి వివరాలు తెలుసుకోండి. ఇరిగేషన్ మంత్రిగా ఉంటూ ఎందుకు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు?’’ అని హరీశ్​రావు ప్రశ్నించారు.