
- ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్, వెలుగు: గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఇవ్వాల్సిన ఆరు డీఏలలో మూడింటిని దసరా నాటికి చెల్లించాలని, లేని పక్షంలో వారి తరఫున ఆందోళన చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఉద్యోగులకు ప్రతినెలా 1న జీతాలతో పాటు పెండింగ్ లేని డీఏలు, పీఆర్సీ ద్వారా మెరుగైన ఫిట్మెంట్ ఇతర హామీలతో ఎలక్షన్లో గెలిచిన సీఎం రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. శనివారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని ఇంట్లో ఉమ్మడి జిల్లా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ లీడర్లు ఆమెను కలిసిన సందర్భంగా మాట్లాడారు.
ఆరు గ్యారంటీలతో ప్రజలను ఆశల పల్లకీలో ఊరేగించారని అన్నారు. ఐదు డీఏలను పెండింగ్ పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని, వీటిలో రెండు చెల్లించడానికి ఇప్పుడో జీవో, ఆరు నెలల తర్వాత మరో జీవో ఇస్తామని కేబినెట్ నిర్ణయించడం వంచన అవుతుందన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా పీఆర్సీ వేయలేదన్నారు. పీఆర్సీ వేసే దాకా మెరుగైన ఫిట్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షుడు నాగరాజు, రేవంత్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్సీ కవిత పర్యటన
నవీపేట్, వెలుగు : మండలంలో ఎమ్మెల్సీ కవిత శనివారం పర్యటన చేశారు. మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ సూరి బాబు కుమారుడి పెండ్లి గత నెలలో జరుగగా, వారి ఇంటికి వెళ్లి నవ దంపతులను సన్మానించారు. రెంజల్ మండలం కళ్యాపూర్ కు చెందిన పిల్లల ప్రవీణ్ బట్టల షాప్ ను సందర్శించారు. అబ్బపూర్ ఎం గ్రామానికి చెందిన నవీపేట్ సొసైటీ చైర్మన్ న్యాలకంటి అబ్బన్న తల్లి మృతి చెందడంతో, కుటుంబీకులను పరామర్శించారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలుఉన్నారు.