ఆ విషయంలో ఫుల్ హ్యాపీ : కళ్యాణి మాలిక్

 ఆ విషయంలో ఫుల్ హ్యాపీ  : కళ్యాణి మాలిక్

సంగీతం అందించిన చిత్రాల సంఖ్య తక్కువే అయినా ఫీల్‌‌ గుడ్ మెలోడీ సాంగ్స్‌‌తో  ప్రేక్షకుల మనసుల్లో చక్కని గుర్తింపును అందుకున్నారు కళ్యాణి మాలిక్. ఆయన సంగీతం అందించిన లేటెస్ట్ మూవీ ‘ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి’. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా  కళ్యాణి మాలిక్ ఇలా ముచ్చటించారు. 

‘టైటిల్‌‌ సాంగ్‌‌తో పాటు ‘కనుల చాటు మేఘమా’ పాటకు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో మోహం లేని మధురమైన ప్రేమను చూస్తారు. అలాంటి ఓ సందర్భంలో వచ్చే పాట అది. అవసరాల గారి అభిరుచికి తగ్గట్లుగా కంపోజ్ చేశాను. ట్యూన్ మాత్రమే కాకుండా లక్ష్మీభూపాల రాసిన లిరిక్స్, ఆభాస్ జోషి గాత్రం వల్లే ఈ పాట అంత హిట్ అయింది. నిజానికి మొదట వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఒక పాట కూడా కంపోజ్ చేశాడు. ఆ తర్వాత ఆయనతో పాటు అవసరాల అడగడంతో నేను ఈ ప్రాజెక్ట్‌‌లోకి వచ్చా. ఈ సినిమా తర్వాత ఇంటింటి రామాయణం, విద్య వాసుల అహం చిత్రాలు రానున్నాయి. అలాగే మరో రెండు వెబ్ సిరీస్‌‌లకు వర్క్ చేస్తున్నా. ఇక నేను కంపోజ్ చేసిన పాటలకు గతంలో అవార్డులు వచ్చాయి. 

కానీ నాకు అవార్డులు రాలేదు. ఈ సినిమాకు కూడా లిరిక్ రైటర్‌‌‌‌గా లక్ష్మీభూపాల, సింగర్ గా ఆభాస్ జోషి అవార్డులు అందుకుంటారనే నమ్మకం ఉంది. నా విషయంలో అవార్డుల కంటే పాట బాగుందనే పేరే ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. వచ్చే నెలతో నేను కెరీర్‌‌‌‌ ప్రారంభించి 20 ఏళ్లు కానుంది. కానీ ఇది నా 19వ సినిమానే. ఆంధ్రుడు, ఐతే, అలా మొదలైంది, అష్టాచమ్మా లాంటి చిత్రాలు సక్సెస్ అయినప్పటికీ ఆ తర్వాత దానికి తగ్గ అవకాశాలు మాత్రం నాకు రాలేదు. దానికి కారణాలు వెతకడం కన్నా, ఇంకా బాగా కష్టపడాలి అనే దృష్టితో పని చేసుకుంటూ వెళ్తున్నా. నా పని పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. 20 ఏళ్ల ప్రయాణంలో నా సంగీతం పట్ల ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆ విషయంలో ఫుల్ హ్యాపీ. ఇక అన్నయ్య కీరవాణి కంపోజ్ చేసిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్ బరిలో నిలవడం గర్వంగా ఉంది. రాజమౌళికి తన సినిమా మీద, ఆ పాట మీద ఉన్న నమ్మకమే ఆస్కార్‌‌‌‌ వరకు తీసుకెళ్లింది’