
కెరీర్ ప్రారంభించింది తెలుగులోనే అయినా.. తమిళ, మలయాళ చిత్రాలతో బిజీ అయింది హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. ఇప్పటికే ఆ రెండు భాషల్లో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఖాతాలో మరో తమిళ చిత్రం చేరింది. కమల్ హాసన్ హీరోగా ఫైట్ మాస్టర్స్ అన్బు–అరివ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కమల్ కెరీర్లో ఇది 237వ సినిమా. ఈ చిత్రంలోని ఓ కీలకపాత్ర కోసం కళ్యాణి ప్రియదర్శన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం జయం రవికి జంటగా ‘జీని’ అనే చిత్రంలో నటిస్తున్న కళ్యాణి.. ఇటీవల కార్తికి జంటగా ఓ సినిమాకు కమిటైంది. ‘మార్షల్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. వెంటనే ఆమె మరో తమిళ సినిమాకు కమిట్ అవడం, అదికూడా కమల్ హాసన్ సినిమాలో కావడం విశేషం.
కమల్ హాసన్ డిఫరెంట్ లుక్లో కనిపించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు నుంచి సెట్స్పైకి వెళ్లబోతోంది. నాలుగు దశాబ్ధాల క్రితం కళ్యాణి తల్లి లిస్సీని తాను నిర్మాతగా రూపొందించిన ‘విక్రమ్’ చిత్రంతో కోలీవుడ్కు పరిచయం చేశారు కమల్ హాసన్. ఇన్నేళ్ల తర్వాత ఆమె కూతురు కమల్ సినిమాలో కనిపించబోతుండడంతో ఆసక్తి నెలకొంది.