తాము ఇంకా ఇండియా కూటమిలో చేరలేదని మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల్ హాసన్ తెలిపారు. దేశం కోసం నిస్వార్థంగా ఆలోచించే వారితోనే కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. స్థానిక భూస్వామ్య రాజకీయాలు చేసే వారితో తమ పార్టీ చేయి కలపదని తేల్చి చెప్పారు. ఎంఎన్ఎం ఏడో వార్షికోత్సవం సందర్భంగా చెన్నైలో మీడియాతో మాట్లాడారు కమల్ .
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తులు గురించి మీడియా ప్రశ్నించగా.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని కమల్ హాసన్ సమాధానం ఇచ్చారు. దీనిపై మరో రెండు రోజుల్లో ప్రకటన వెలువడుతుందని, ఏదైనా శుభవార్త ఉంటే మీడియా వేదికగా వెల్లడిస్తానని చెప్పారు. మరోవైపు నటుడు విజయ్ పొలిటిల్ ఎంట్రీని కమల్ స్వాగతించారు. లోక్సభ ఎన్నికలకు అధికార డీఎంకేతో కమల్ పార్టీ పొత్తు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది డీఎంకే పార్టీ ఇండియా కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే.
2018లో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించారు. 2019, 2021లో జరిగిన లోక్సభ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన కమల్ హాసన్తో పాటు ఆ పార్టీ అభ్యర్థులందరూ పరాజయం పొందారు.