కామారెడ్డి జిల్లాలో వానాకాలం సాగుకు రెడీ .. విత్తనాలు, ఎరువులు రెడీ చేసుకుంటున్న రైతులు

కామారెడ్డి జిల్లాలో వానాకాలం సాగుకు రెడీ .. విత్తనాలు, ఎరువులు రెడీ చేసుకుంటున్న రైతులు
  • తొలకరి పలకరింపుతో  విత్తనాలు, ఎరువులు రెడీ చేసుకుంటున్న రైతులు 
  • కామారెడ్డిలో  దుకాణాల్లో సందడి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.  బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ ఏరియాల్లో మడులు సిద్ధం చేసి వరి నారు పోశారు.  జిల్లాలో సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది.  సోమవారం  కురిసిన భారీ వర్షానికి  విత్తనాలు, ఎరువులు కొనేందుకు రైతులు అధిక సంఖ్యలో రైతులు కామారెడ్డికి తరలి వచ్చారు.  సీడ్స్​ షాపులు రైతులతో సందడిగా కనిపించాయి.  

5 లక్షల ఎకరాల పైనే పంటల సాగు

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5,17,677 ఎకరాల్లో  పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.  ఇందులో ప్రధానంగా వరి 3,18,342 ఎకరాలు,  పత్తి 34,459 ఎకరాలు, సోయా 84,220 ఎకరాలు,  మక్క 52,016 ఎకరాలు సాగు చేయనున్నట్లు అంచనా. ఇప్పటికే రైతులకు సొసైటీల ద్వారా 3 వేల క్వింటాళ్ల జీలుగ విత్తనాలు రైతులకు సప్లయ్ చేశారు. కామారెడ్డి జిల్లాకు 95 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం.  పత్తి విత్తనాల ప్యాకెట్లు 35 వేలు అవసరం కాగా 57 వేలు వరకు అందుబాటులో ఉన్నాయి.   సోయా 25 వేల క్వింటాళ్లు, మక్క 7  వేల క్వింటాళ్ల విత్తనాలు  వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయి. 

ఈ సీజన్​కు మక్క విత్తనాలు 4,161 క్వింటాళ్లు అవసరం కాగా అంతకు మించి మార్కెట్లో ఉన్నాయి.  15 వేల  మెట్రిక్​ టన్నుల యూరియా,  కాంప్లెక్స్ ఎరువులు 17,762  మెట్రిక్​ టన్నులు అందుబాటులో ఉన్నాయి.  నకిలీ విత్తనాలు రాకుండా కట్టడి చేయడానికి  వ్యవసాయ శాఖ డివిజన్ల వారీగా వ్యవసాయ,  పోలీసు అధికారులతో  4  టాస్క్​ఫోర్స్​ టీమ్స్​ఏర్పాటు చేశారు.  కామారెడ్డి, తాడ్వాయి, జుక్కల్, సదాశివనగర్,  రామారెడ్డి మండలాల్లో  వర్షం దంచి కొట్టగా..  సోయా, మక్క విత్తనాలు వేయనున్నారు.  బాన్సువాడ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వరి నారు పోశారు. 

విత్తనాలు, ఎరువులకుఇబ్బంది లేదు

వానకాలం సీజన్​కు సరిపడా విత్తనాలు, ఎరువులు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.  ఎరువులు ఈ నెలకు సరిపడతాయి.  రైతులకు ఇబ్బందులు లేకుండా  చూస్తాం.  ఆయా ఏరియాల్లో  6  నుంచి 7 సెం.మీ. మేర వర్షం కురిసిన తర్వాతనే భూమిలో విత్తనాలు వేయాలి. 

తిరుమల ప్రసాద్​, జిల్లా వ్యవసాయ అధికారి