
మంచు విష్ణు టైటిల్ రోల్లో ‘మహాభారతం’ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప’. మోహన్ బాబు నిర్మించారు. ఈనెల 27న సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ చిత్ర విశేషాలను గురించి ఇలా ముచ్చటించారు. ‘‘మహాభారతం సీరియల్లో దృతరాష్ట్రుడిగా నటించిన ఠాకూర్ అనూప్ సింగ్.. విష్ణు సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’లో నటించారు. ఆయన నా గురించి విష్ణుకు చెప్పడంతో ‘కన్నప్ప’ కోసం సంప్రదించారు. విష్ణు స్టోరీ చెప్పాక.. చాలా రీసెర్చ్ చేశాను.
నేనొక సీరియల్ దర్శకుడిని అయినప్పటికీ నేను చేసినవన్నీ హై బడ్జెట్ ప్రాజెక్టులే. సినిమా అయినా, సీరియల్ అయినా ఒకే మైండ్ సెట్తో పనిచేశాను. ఇక విష్ణు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం లాంటి సీనియర్స్, పాన్ ఇండియా ఆర్టిస్టులు ఉన్నప్పటికీ వాళ్లంతా అంకితభావంతో పనిచేయడంతో నా వర్క్ చాలా సులభమైంది.
ప్రభాస్ పాత్ర ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంది. ఎవ్వరి ఫ్యాన్స్ నిరాశచెందరు. ముఖ్యంగా చివరి గంట అద్భుతంగా ఉంటుంది. శ్రీకాళహస్తి అర్చకులకు ఈ చిత్రాన్ని చూపించాం. అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. నిజానికి ‘కన్నప్ప’ అనేది మైథాలజీ కాదు.. ఇది మన చరిత్ర. జరిగిన ఘటనను ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతారు. అందుకు కన్నప్పపై రకరకాల కథలు ఉన్నాయి. గత చిత్రాల తరహాలోనే ఇందులోనూ కొంత ఫిక్షనల్ పార్ట్ ఉంటుంది. ఇక నేను సీరియల్గా తీసిన ‘మహాభారతం’ను ఇప్పుడు సినిమాగా తీయాలని అనుకుంటున్నా. రాజమౌళి గారు, ఆమిర్ ఖాన్ గారు కూడా తీస్తామన్నారు. మహాభారతం అనేది ఓపెన్ సబ్జెక్ట్. ఎవరైనా తీయొచ్చు’’.