
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూపు ఇండియా ఎకానమీకి కీలకమని, ఇది మౌలిక సదుపాయాలలో కీలక పాత్ర పోషిస్తుందని అమెరికాకు చెందిన కాంటర్ ఫిట్జ్ గెరాల్డ్ అండ్ కో తెలిపింది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేరు 50 శాతం కంటే ఎక్కువ లాభాలను అందించగలదని బ్రెట్ నోబ్లాచ్, థామస్ షిన్స్కే అనే ఎనలిస్టులు పేర్కొన్నారు.
" ఇండియా 2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని కోరుకుంటోంది. అక్కడికి చేరుకోవడానికి తన ఇంధన ఉత్పత్తిని పెంచడంతోపాటు, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టాలి" అని ఫిట్జ్ పేర్కొంది. ఈ పెట్టుబడులు ఉత్పాదకత, వృద్ధిని పెంచడానికి అత్యంత ముఖ్యమైనవని అభిప్రాయపడింది. చైనాతో పోటీ పడాలంటే పెట్టుబడులు కీలకమని పేర్కొంది.
భారతదేశ ఆర్థికపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) కీలకపాత్ర పోషిస్తుందని కామెంట్ చేసింది. ఈ సంస్థ చేతుల్లో కీలక వ్యాపారాలు ఉన్నాయని తెలిపింది. మార్కెట్ క్యాప్ ఆధారంగా ఏఈఎల్ భారతదేశంలో 10వ అతిపెద్ద ఆర్థికేతర పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. " అదానీని పక్కనపెట్టడం కుదరదు. భారతదేశానికి అదానీ ఎంత అవసరమో, ఈ గ్రూపునకు కూడా భారత్ అంతే అవసరం అని మేం నమ్ముతున్నాం" అని కాంటర్ పేర్కొంది.