
- అనారోగ్యంతో మహిళా డాక్టర్ చనిపోతే కనికరం చూపని ఇంటి ఓనర్
- కర్మకాండలకు ఇంటిని ఇచ్చి మానవత్వం చాటిన లాయర్
నందిపేట,వెలుగు: అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంతో ఓ మహిళ చనిపోతే మానవత్వం మరిచిన ఆ ఇంటి ఓనర్ ఆమె డెడ్బాడీని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన శబరి(60) తన కుటుంబంతో కలిసి పదేండ్ల కింద నిజామాబాద్ జిల్లా నందిపేటకు వచ్చారు. మండల కేంద్రంలోని సిద్ధి వినాయక హాస్పిటల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. ఆమె భర్త ఐదేండ్ల కింద అనారోగ్యంతో చనిపోగా కొడుకుతో కలిసి మండల కేంద్రంలోని రాంనగర్లోని ఓ ఇంట్లో రెంట్కు ఉంటోంది. కొద్దిరోజుల నుంచి క్యాన్సర్తో బాధపడుతూ ఆదివారం రాత్రి హాస్పిటల్లో చనిపోయింది.
అంత్యక్రియలు నిర్వహించేందుకు డెడ్బాడీని ఆమె కొడుకు అద్దె ఇంటికి తీసుకొస్తే సదరు ఇంటి ఓనర్ అందుకు అంగీకరించలేదు. డెడ్బాడీని ఇంట్లోకి తీసుకురావొద్దని కరాఖండిగా చెప్పేశాడు. సొంత ఊరిలో అన్నీ వదిలేసి ఇక్కడికే వచ్చామని, ఇంటిలోకి రానివ్వాలని శబరి కుటుంబసభ్యులు వేడుకున్నారు. చివరికి ఇరుగుపొరుగు వారితో చెప్పించినా ఇంటి ఓనర్ మనసు కరగలేదు. ఇది గమనించి అదే కాలనీలో ఉంటున్న పెద్దోళ్ల దేవన్న అనే లాయర్ కర్మకాండ ముగిసేంత వరకు తన ఇంటిని వాడుకునేందుకు అవకాశం ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నాడు. దీంతో శబరి కుటుంబసభ్యులు సోమవారం దహన సంస్కారాలు నిర్వహించారు.