
- ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఫైన్ల బాదుడు
- రెడ్ లైట్ దాటినా, రాంగ్ రూట్, సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకోకున్నా గుర్తించే కెమెరాల ఏర్పాటు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీపై శుక్రవారం నుంచి నిఘా మరింత పెరగనుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 769 సీసీ కెమెరాలతో పోలీసులు ట్రాఫిక్, క్రైం, అనుచిత కార్యకలాపాలపై నిఘాను కట్టుదిట్టం చేయబోతున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో సీసీ కెమెరాలతో అనుసంధానించి 24/7 పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి బుధవారం సందర్శించారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనితీరుపై కమాండ్ కంట్రోల్ నిర్వాహాకుడు నాగేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా
వివరించారు.
అన్ని జంక్షన్లలోనూ కెమెరాలతో నిఘా..
110 చోట్ల 335 సీసీ సర్వేలెన్స్ కెమెరాలు ఏర్పాటు చేయగా ఇందులో 35 పాన్ టిల్ట్ జూమ్(పీటీజెడ్) కెమెరాలు, 300 ఫిక్స్ డ్ కెమెరాలు ఉన్నాయి. 24 జంక్షన్లలో ట్రాఫిక్ ఎన్ ఫోర్స్ మెంట్ కెమెరాలు ఏర్పాటు చేయగా వీటిలో 85 రెడ్ లైట్ వాయిలేషన్ డిటెక్షన్(ఆర్ఎల్వీడీ) కెమెరాలు, 174 ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడ్(ఏపీఎన్ఆర్) కెమెరాలు ఉన్నాయి. లిమిట్ దాటి స్పీడ్గా వెళ్లే వాహనాలను గుర్తించే టెక్నాలజీతో సిటీలోని 10 చోట్ల 60 కెమెరాలు ఏర్పాటు చేయగా... అందులో ఎవిడెన్స్ కెమెరాలు 20, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడ్(ఏపీఎన్ఆర్) కెమెరాలు 40 ఉన్నాయి. రాంగ్ రూట్లో వాహనాలు వచ్చినా గుర్తించేందుకు 10 చోట్ల 30 కెమెరాలు ఏర్పాటు చేయగా.. ఇందులో ఎవిడెన్స్ కెమెరాలు, 20 ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడ్(ఏపీఎన్ఆర్) కెమెరాలు ఉన్నాయి. వీటితోపాటు 24 జంక్షన్లలో 85 అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం(ఏటీసీఎస్) కెమెరాలను ఏర్పాటు చేశారు.
రూల్స్ ఉల్లంఘిస్తే బాదుడే
రెడ్ సిగ్నల్ పడినా జంప్ చేస్తే కెమెరాలు వాహనాల నంబర్ ను రెడ్ లైట్ వాయిలేషన్ డిటెక్షన్(ఆర్ఎల్వీడీ) కెమెరాలు క్యాప్చర్ చేస్తాయి. హెల్మెట్ లేకుండా బైక్ నడిపినా, సీటు బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపినా కెమెరాలు గుర్తిస్తాయి. సెల్ ఫోన్ నడుపుతూ డ్రైవింగ్ చేసినా, రాంగ్ రూట్ లో వెళ్లినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా ఈ కెమెరాలు పట్టేస్తాయి. ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ ను కూడా ఈ కెమెరాలు గుర్తిస్తాయి. ఎంత వేగంతో వెళ్లినా, ఎలా వెళ్లినా నంబర్ ప్లేట్ను గుర్తించే టెక్నాలజీ కలిగిన కెమెరాలను ప్రత్యేకంగా
అమర్చారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫైన్ తప్పదు..
సీసీ కెమెరాల ద్వారా ఇక మీదట ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను పర్యవేక్షిస్తాం. తదనుగుణంగా చలాన్లు జారీ చేస్తాం. ప్రజల భద్రతను పెంచడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం, నగరంలో ట్రాఫిక్ను నియంత్రించడమే ప్రధాన లక్ష్యం. కరీంనగర్ నగర ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి.
గౌస్ ఆలం, సీపీ, కరీంనగర్