
- ట్రెజరీకి పంపిన వ్యవసాయ శాఖ
కరీంనగర్, వెలుగు: వానాకాలం పంట పెట్టుబడి కోసం జిల్లాలోని రైతులకు రైతుభరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులు సోమవారం ట్రెజరీకి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 2,10,905 మంది రైతులు ఉండగా.. వారికి రైతు భరోసా కింద రూ.211,90, 69,941 చెల్లించాల్సి ఉంది. ఏవో, ఏఈవోల వెరిఫికేషన్ అనంతరం సోమవారం 1,68,218 మంది రైతులకు సంబంధించి రూ.139.08 కోట్లను ట్రెజరీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. మిగతా రైతుల అకౌంట్ల వెరిఫికేషన్ అనంతరం వారికి కూడా రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని డీఏవో భాగ్యలక్ష్మి వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లాలో 1,62,287 మంది రైతులకు గానూ రూ.165.13 కోట్లు జమ కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1,51,506 మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఏఈవోలు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు వెరిఫై చేశారు. 1,22,653 మంది రైతులకు సంబంధించి రూ.86.01 కోట్ల రైతు భరోసా నిధులను ట్రెజరీకి ట్రాన్స్ఫర్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 77,050 మంది రైతుల ఖాతాల్లో రూ. 43.26 కోట్లు ట్రెజరీకి పంపినట్లు అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లాలో 2,48,550 మంది రైతులకు సంబంధించి రూ. 251.14 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు తెలిపారు.