
బెంగుళూర్: ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగుళూర్లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. 11 మంది చావుకు కారణమైన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహారించి తొక్కిసలాటకు కారణమైన అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేస్తోంది. ఇందులో భాగంగానే బెంగళూరు తొక్కిసలాట ఘటనకు బాధ్యులుగా బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్తో పాటు ఏసీపీ, డీసీపీలపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరితో పాటు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ మాస్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్లను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ ఘటనలో తాజాగా మరో ఉన్నతాధికారిపై వేటు పడింది. బెంగుళూర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శి కె. గోవిందరాజ్పై ప్రభుత్వం వేటు వేసింది. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్ సెక్రటరీ పదవి నుంచి తక్షణమే కె. గోవిందరాజ్ను తొలగించినట్లు శుక్రవారం (జూన్ 6) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా ఆర్సీబీ విక్టరీ పరేడ్కు అనుమతి ఇవ్వొద్దని కె.గోవిందరాజ్ సీఎం సిద్ధరామయ్యకు సూచించారని.. అయినప్పటికీ గోవిందరాజ్ మాటను పట్టించుకోకుండా సీఎం సిద్ధరామయ్య ఆర్సీబీ ర్యాలీకి అనుమతి ఇచ్చారని వార్తలు వినిపించాయి. దీంతో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన గోవిందరాజ్ ఆర్సీబీ విక్టరీ పరేడ్కు అనుమతి ఇవ్వొద్దని తాను సీఎంకు సూచించానని వస్తోన్న వార్తలను ఖండించారు.
తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఈ విషయంలో ముఖ్యమంత్రికి సలహా ఇవ్వడానికి తానెవరని అన్నారు. క్రికెట్ వేడుకలకు సంబంధించిన నిర్ణయాలలో తనకు ఎలాంటి పాత్ర లేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఈ తొక్కసలాట ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. కర్నాటక ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ విరుచుకుపడుతోంది.
ఆర్సీబీ విక్టరీ పరేడ్ నిర్వహణకు పోలీసులు ముందు అనుమతి నిరాకరించారని.. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పర్మిషన్ ఇవ్వడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ఆరోపించింది బీజేపీ. కానీ ప్రభుత్వం అధికారులను బలి పశువులను చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్ట్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ వేసిన ప్రభుత్వం 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.