
బెంగళూరు: గ్యాంగ్ రేప్ కేసులో బెయిల్ పొందిన నిందితులు కార్లు, బైక్లతో రోడ్లపై ర్యాలీగా వెళ్తూ హల్చల్చేశారు. కర్నాటకలోని హవేరీ జిల్లా అక్కి అలూర్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఊరేగింపు ర్యాలీకి సంబంధించిన వీడియో వైరల్కావడంతో సోషల్మీడియాలో తీవ్ర వివాదాస్పదమైంది. కర్నాటకలోని హవేరీలో గత సంవత్సరం ఓ మహిళపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
2024 జనవరి 8న హనగల్ టౌన్లోని ఒక ప్రైవేట్ హోటల్లో ఓ జంట (26 ఏండ్ల మహిళ, 40 ఏండ్ల కర్నాటక రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్) ఉండగా.. నిందితులు దౌర్జన్యంగా వారి గదిలోకి చొరబడి.. ఆ మహిళను హోటల్ నుంచి సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లి ఏడుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధిత మహిళ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. ఏడుగురు ప్రధాన నిందితులతో సహా మొత్తం 19 మందిని అరెస్టు చేశారు.
బాధితురాలు తొలుత నిందితులను గుర్తించినప్పటికీ.. కోర్టు విచారణ సమయంలో వారిని గుర్తుపట్టడటంలో ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలో నిందితుల్లోని 12 మంది పది నెలల క్రితం బెయిల్పై విడుదలయ్యారు. ప్రధాన నిందితులైన ఏడుగురికి మాత్రం ఇటీవలే బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వచ్చిన నిందితులు.. రోడ్లపై కార్లు, బైక్ల మీద వేగంగా వెళ్తూ.. గట్టిగా అరుస్తూ విక్టరీ సింబల్చూపుతూ ర్యాలీగా వెళ్లి హల్చల్ చేశారు. ఆ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.