మనుషుల ప్రాణాలను తీస్తున్న 23 రకాల జాతుల పెంపుడు కుక్కలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో పిట్బుల్ టెర్రియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలీరో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్డాగ్, బోర్బోయెల్ కంగల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ డాగ్, కాకేసియన్ షెపర్డ్ డాగ్ వంటి జాతులను నిషేధించాలని కేంద్రం కోరింది.
అత్యంత ప్రమాదకరమైన ఈ 23 రకాల బ్రీడింగ్ ను నిలిపివేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ప్రమాదకరమైన కుక్కలను అమ్మడం లేదా, పెంచుకోవడం, ఉంచుకోవడం కోసం ఎలాంటి లైసెన్సులు లేదా పర్మిషన్లు ఇవ్వొద్దని కేంద్ర పశుసంవర్ధక శాఖ ఆదేశించింది.
అయితే 23 రకాల జాతులపై నిషేధం విధించాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను కర్ణాటక హైకోర్టు ఏప్రిల్ 10న కొట్టివేసింది. సర్క్యులర్ను జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది కానీ.. ప్రమాదకరమైన జంతువులు హాని కల్గించినప్పుడు.. వాటి యజమానులు లేదా ఆయా సంస్థలను సంప్రదించి నిషేదించాలని కర్ణాటక కోర్టు తెలిపింది. దీంతో సింగిల్ జడ్జి జస్టిస్ ఎం నాగప్రసన్న కేంద్ర సర్క్యులర్ను కొట్టివేశారు.