Karnataka Polls: బోనీ కపూర్‌కు చెందిన రూ.39 లక్షల విలువైన వెండి వస్తువులు స్వాధీనం..!

Karnataka Polls: బోనీ కపూర్‌కు చెందిన రూ.39 లక్షల విలువైన వెండి వస్తువులు స్వాధీనం..!

కర్ణాటకలో మరో నెలలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద భారీ నిఘాను ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేస్తూ భద్రతను ఇంకా పటిష్టం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే దావంగెరె శివార్లలోని హెబ్బలు టోల్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద బాలీవుడ్ సినీ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన రూ. 39 లక్షల విలువైన 66 కిలోల వెండి వస్తువులను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన ఏప్రిల్ 7న తెల్లవారుజామున జరిగింది. చెన్నై నుంచి ముంబైకి వెళ్తున్న బీఎండబ్ల్యూ కారులో ఐదు బాక్సుల్లో సరైన పత్రాలు లేకుండా వెండి సామాగ్రిని తరలిస్తుండా పట్టుబడినట్టు అధికారులు తెలిపారు. ఈ కేసులో డ్రైవర్ సుల్తాన్ ఖాన్ తో పాటు కారులో ఉన్న హరిసింగ్ పై దావణగెరె రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 

ఈ కారు బోనీ కపూర్‌కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రిజిస్టర్ అయినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత కారులో ప్రయాణించిన హరిసింగ్ ను విచారించగా.. తరలిస్తున్న వెండి వస్తువులు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుటుంబానికి చెందినవని అంగీకరించారు. ఈ ఘటనలో సంబంధిత పత్రాలు సమర్పించని వెండి వస్తువులను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వెండి వస్తువులు నిర్మాత బోనీ కపూర్ కుటుంబానికి చెందినవా, లేదంటే ఆ వ్యక్తి కావాలనే అలా చెప్పాడా అన్న దానిపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.