బెంగళూరు: కేరళలో నిపా వైరస్ కేసులు నమోదైనందున ఆ రాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారులు అలర్ట్గా ఉండాలని కర్నాటక సర్కారు ఆదేశాలు జారీ చేసింది. జ్వరం, దగ్గు, తలనొప్పి, శ్వాస సంబంధ సమస్యలు, వాంతులు, నొప్పులు, డయేరియా తదితర సమస్యలతో కేరళ నుంచి వచ్చేవారిని మానిటర్ చేయాలని చెప్పింది. సెప్టెంబరు 5న కేరళలోని కొజికోడ్లో నిపా వైరస్తో 12 ఏండ్ల పిల్లాడు మరణించాడు. ఆ పిల్లాడికి దగ్గరగా ఉన్న పేరెంట్స్, హెల్త్ వర్కర్లు సహా ఎనిమిది మందికి టెస్టులు చేయగా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. అయితే, కొజికోడ్, కన్నూర్, మలప్పురం, వాయనాడ్లో కేరళ సర్కారు హై అలర్ట్ ప్రకటించింది. ‘‘పక్క రాష్ట్రం కేరళలో నిపా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కర్నాటకలో ప్రజల ఆరోగ్యంపై, ముఖ్యంగా కేరళ సరిహద్దు జిల్లాలు దక్షిణ కన్నడ, ఉడుపి, మైసూరు, కొడగు, చామరాజనగరపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అధికారులు అలర్ట్గా ఉండాలి.’’ అని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ జవైద్ అక్తర్ అన్నారు. ఒక్క కేసు కూడా నమోదు కాకున్నా జిల్లా అధికారులు ప్రతిరోజూ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్కు రిపోర్టు పంపించాలని చెప్పా రు. స్థానిక పరిస్థితుల ప్రకారం అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. నిపా వైరస్ మనుషుల్లో వ్యాప్తిచెందుతున్న జెనటిక్ వ్యాధి అని ఆరోగ్య శాఖ తెలిపింది. 2018లో కేరళలో కేసులు నమోదయ్యాయని, చాలామంది చనిపోయారని గుర్తుచేసింది. టెరోపస్ అనే జాతి గబ్బిలాల నుంచి నిపా సోకుతుంది. సోకిన వారిలో 40% నుంచి 75% మంది మరణించే అవకాశం ఉందని అంచనా.