
ఇటీవల వచ్చిన ‘సత్యం సుందరం’ చిత్రంతో నటుడిగా మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గరయ్యాడు కార్తి. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇక కార్తి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఖైదీ’ సీక్వెల్పై కూడా గుడ్ న్యూస్ ఉండబోతోంది. కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2019 అక్టోబర్లో విడుదలైంది. దీనివల్లే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సాధ్యమైంది. ఈ యూనివర్స్లో భాగంగా కమల్ హాసన్ ‘విక్రమ్’ వచ్చింది.
దాన్నుంచి సూర్య ‘రోలెక్స్’ రాబోతోంది. ఆల్రెడీ రజినీకాంత్ హీరోగా ‘కూలీ’ తెరకెక్కుతోంది. ఇంకొన్ని చిత్రాలు కూడా ప్లానింగ్లో ఉన్నాయి. వీటన్నింటికీ కారణమైన ‘ఖైదీ’కి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని కార్తి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందిస్తూ ఈ మూవీ మేకింగ్ స్టిల్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘అంతా ఇక్కడి నుంచే మొదలైంది.. హీరో కార్తి, నిర్మాత ఎస్ఆర్ ప్రభులకు థ్యాంక్స్.. వీరి వల్లే ఈ యూనివర్స్ సాధ్యమైంది.. త్వరలో ఢిల్లీ తిరిగి రానున్నాడు” అని పోస్ట్ చేశాడు. ‘ఖైదీ’ చిత్రంలో ఢిల్లీ అనే పాత్రలో కార్తి నటించిన విషయం తెలిసిందే.