- యూత్ కామన్వెల్త్లోనూ మెడల్ గెలవాలి
హైదరాబాద్, వెలుగు: సూపర్ డిఫెన్స్, అంతకుమించిన టెక్నిక్తో తెలుగు కుర్రాడు అరబండి కార్తీక్ రెడ్డి.. కరాటే చాంపియన్షిప్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. కెరీర్ రెండో టోర్నీలోనే తిరుగులేని పెర్ఫామెన్స్తో ప్రపంచ ప్రత్యర్థులను గడగడలాడించాడు. దీంతో ఈ నెల 7 నుంచి 12 వరకు బర్మింగ్హామ్లో జరిగిన 10వ కామన్వెల్త్ కరాటే చాంపియన్షిప్లో కార్తీక్ గోల్డ్ మెడల్తో మెరిశాడు. –70 కేజీల క్యాడెట్(కుమిట్) కేటగిరీ ఫైనల్లో కార్తీక్.. గ్జారలన్పౌస్ గ్జారలంపోస్ (సైప్రస్)ను ఓడించి విన్నర్గా నిలిచాడు. సెమీస్లో కామన్వెల్త్, యూరోపియన్ చాంపియన్పై గెలిచి ఫైనల్స్కు అర్హత సాధించాడు. అంతకుముందు ఏప్రిల్లో లాస్వేగాస్లో జరిగిన యూఎస్ఏ ఓపెన్ చాంపియన్షిప్లోనూ కార్తీక్ స్వర్ణాన్ని నెగ్గాడు. దీంతో చాంపియన్షిప్స్లో వరుసగా రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి ఇండియన్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. అండర్–12, 13 బాయ్స్ కేటగిరీలో అమెరికా, జపాన్, బోట్స్వానా, పనామా, నేపాల్, ఫ్రాన్స్, వెనిజులా, ఇరాన్తో సహా 40 దేశాల నుంచి 300 మంది ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఇందులో కార్తీక్ సూపర్ పెర్ఫామెన్స్, టెక్నిక్తో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ మెడల్ను సాధించాడు. గతంలో సైప్రస్లో జరిగిన జూరాలం పౌస్ కరాటే చాంపియన్షిప్లో సిల్వర్, జాకబ్ కట్లర్ (ఇంగ్లండ్) టోర్నీలో బ్రాంజ్, హారీసన్ లుకాస్ (స్కాట్లాండ్) టోర్నీలోనూ మెడల్స్ను సాధించాడు. కామన్వెల్త్ మెడల్ సాధించి గురువారం హైదరాబాద్కు చేరుకున్న కార్తీక్కు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఈ చాంపియన్షిప్లో ఇండియా తరఫున 104 మంది ప్లేయర్లు బరిలోకి దిగితే 3 గోల్డ్, 6 సిల్వర్, 14 బ్రాంజ్ మెడల్స్ లభించాయి.
వరల్డ్ చాంపియన్ లక్ష్యం..
తిరుపతికి చెందిన కార్తీక్.. ఓవైపు చదువు, మరోవైపు కరాటేలో దూసుకుపోతున్నాడు. రెండింటిని మేనేజ్ చేస్తూ తాను అనుకున్న లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఇందుకోసం పేరెంట్స్, కోచ్లు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. అయితే వచ్చే నెలలో జరిగే వరల్డ్ చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలవడమే తన ముందున్న లక్ష్యమని కార్తీక్ స్పష్టం చేశాడు. దీంతో పాటు యూత్ కామన్వెల్త్, వరల్డ్ ర్యాంకింగ్ టోర్నీల్లోనూ పతకాలు సాధించాలని భావిస్తున్నాడు. కామన్వెల్త్ చాంపియన్గా నిలవడంతో కార్తీక్ ఈ టోర్నీలకు అర్హత సాధించాడు. ఈ టోర్నీలు టర్కీ, వెనిస్లో జరగనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్కు చేరుకున్న కార్తీక్.. ఈ మెగా టోర్నీల కోసం త్వరలోనే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టనున్నాడు. ఇందుకోసం రోజుకు నాలుగైదు గంటలు శ్రమిస్తానని కార్తీక్ చెప్పాడు. నిజాంపేట్లో మై డోజో అకాడమీలో నేషనల్ చీఫ్ కోచ్ కీర్తన్ కొండూరు దగ్గర ఆటలో మెలకువలు నేర్చుకుంటున్నాడు. ఇండియాలో సెలెక్టివ్ టోర్నీల్లోనే బరిలోకి దిగుతానని చెప్పిన ఈ తెలుగు కుర్రాడు.. ఇంటర్నేషనల్ లెవెల్లో దేశానికి మరిన్ని పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న కార్తీక్.. మరో మూడేళ్ల పాటు క్యాడెట్ కేటగిరీలో పోటీ పడనున్నాడు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి హై లెవెల్ పోటీల్లో రాణించాలని ప్లాన్స్ వేసుకుంటున్నాడు.
పోటీ ఎక్కువే..
కరాటేను ఒలింపిక్ ఈవెంట్గా గుర్తించడంతో గత రెండేళ్లలో పోటీ విపరీతంగా పెరిగింది. టోర్నీ ఏదైనా దాదాపు 180 దేశాల నుంచి ప్లేయర్లు బరిలోకి దిగుతారు. ఇందులో రాణించాలంటే అత్యున్నత స్థాయి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కార్తీక్ హైదరాబాద్లోనే శిక్షణ తీసుకుంటున్నా.. రాబోయే రోజుల్లో స్పెయిన్, ఫ్రాన్స్లో ట్రెయినింగ్ తీసుకోనున్నాడు. ప్రస్తుతానికి ప్రతి టోర్నీకి సొంత డబ్బులతోనే వెళ్తున్న కార్తీక్.. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే కరాటేలో గోల్డ్ చాంపియన్షిప్ను గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇందుకోసం మరింతగా శ్రమిస్తానని చెప్పాడు.
కామన్వెల్త్లో ఇండియాకు మెడల్ సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. నా కెరీర్కు మద్దతుగా నిలుస్తున్న పేరెంట్స్, కోచ్లకు కృతజ్ఞతలు. ప్రభుత్వాలు సహకరిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి దేశానికి పేరు తీసుకొస్తా. కోచ్, ప్లేయర్లకు ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్లో మరింత మంది చాంపియన్స్ తయారవుతారు. ప్రస్తుతం వరల్డ్ చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలవడం నా టార్గెట్. –కార్తీక్