దమ్ముంటే కార్తీక్​రెడ్డి టికెట్ ​తెచ్చుకుని మాట్లాడాలి : ప్రకాశ్ ​గౌడ్

దమ్ముంటే కార్తీక్​రెడ్డి టికెట్ ​తెచ్చుకుని మాట్లాడాలి : ప్రకాశ్ ​గౌడ్

శంషాబాద్, వెలుగు: మంత్రి సబితారెడ్డి కొడుకు, బీఆర్ఎస్ ​లీడర్ పటోళ్ల కార్తీక్​రెడ్డిపై అదే పార్టీ రాజేంద్రనగర్​ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మైలార్ దేవ్ పల్లి దుర్గానగర్ చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్​ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు సార్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా గెలిచానని, సీఎం కేసీఆర్​తోపాటు మంత్రి కేటీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు. 

ఎవరు ఎన్ని మాటలు చెప్పినా రాజేంద్రనగర్ టికెట్ తనకే కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​ కూడా గతంలో సిట్టింగులకే తిరిగి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని ప్రకాశ్​గౌడ్​గుర్తుచేశారు. ‘చేతగాని మాటలు మాట్లాడడం కాదు.. దమ్ము, ధైర్యం ఉంటే టికెట్ తెచ్చుకొని మాట్లాడాలని’ కార్తీక్ రెడ్డికి సవాల్  విసిరారు. 

కాగా సోమవారం మహేశ్వరంలో కార్తీక్​రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నుంచి సబితారెడ్డి పోటీ చేస్తే.. రాజేంద్రనగర్ నుంచి తాను పోటీ చేస్తానని.. ఈ ఒక్క సీటును తనకు కేటాయించాలని’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ప్రకాశ్ ​తీవ్ర స్థాయిలో స్పందించారు.