
బెంగళూరు: మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20 నాలుగో ఎడిషన్ కోసం.. టీమిండియా ప్లేయర్లు కరుణ్ నాయర్, ప్రసిధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్ను ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ టోర్నీని ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 11 నుంచి 27 వరకు మ్యాచ్లు జరుగుతాయి.
గత సీజన్లో 560 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచిన నాయర్.. మైసూర్ వారియర్స్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ప్రసిధ్ కృష్ణ, కార్తీక్ ఎస్యూను కూడా కొనసాగించారు. నిరుడు రన్నరప్గా నిలిచిన బెంగళూరు బ్లాస్టర్స్.. మయాంక్ అగర్వాల్ను కంటిన్యూ చేసింది. గుల్బర్గా మిస్టిక్స్ కెప్టెన్గా వైశాక్ విజయ్ కుమార్తో పాటు స్మారన్, లువ్నిత్ సిసోడియా టీమ్లో ఉన్నారు. పేసర్ వాసుకి కౌశిక్ను శివమొగ్గ లయన్స్ నిలుపుకుంది. మిగతా ప్లేయర్ల కోసం ఈ నెల 15న వేలం జరగనుంది.