సమస్యల పరిష్కారానికి కంప్లైంట్​ బాక్సుల ఏర్పాటు : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

సమస్యల పరిష్కారానికి కంప్లైంట్​ బాక్సుల ఏర్పాటు : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కామారెడ్డి ఎమ్మెల్యే

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. తమ సమస్యను చెప్పుకోవడానికి ఎమ్మెల్యే దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండా ఊళ్లు, టౌన్​లలో కంప్లైంట్​ బాక్సులను ఏర్పాటు చేశారు. ఆదివారం కామారెడ్డి టౌన్​తో పాటు, ఇసాయిపేట, చుక్కాపూర్, జనగామ, దోమకొండ, పెద్దమల్లారెడ్డి, తలమడ్ల, చిన్నమల్లారెడ్డిలో ఈ బాక్స్​లను ఎమ్మెల్యే ప్రారంభించారు.

మిగతా చోట్ల కూడా బాక్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి మాట్లాడుతూ..  ఏ సమస్య ఉన్నా కాగితంపై రాసి బాక్సులో వేస్తే, వారంలోగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రజల వద్దకే  పాలన అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

ఇకపై ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు పనులు మానుకొని, డబ్బులు ఖర్చు చేసి ప్రయాణాలు చేసే అవసరం లేదన్నారు. సమస్య ఏమిటన్నది వివరంగా పేర్కొని, పేరు, ఊరు, ఫోన్​నెంబర్​రాసి బాక్సులో వేయాలన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీసు నుంచి ఫోన్​చేసి మొత్తం వివరాలు తెలుసుకుంటామన్నారు. సమస్యను ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లి, వారు తీసుకున్న చర్యలను కంప్లైంట్​చేసిన వ్యక్తికి తెలియజేస్తామన్నారు.