
బీసీల బంద్ కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. దాదాపు 100 మందితో మానవహారం నిర్వహించారు. చౌరస్తాలో తన కొడుకు ఆదిత్యతో పాటు రోడ్డుపై బైఠాయించి బీసీ బిల్లుకు మద్దతుగా నినాదాలు చేశారు కవిత.
బీసీ బిడ్డలు తమ జనాభాకి అనుకూలంగా రిజర్వేషన్లు అడుగుతున్నారని.. త్యాగాలు లేకుంటే బీసీ బిల్లు వచ్చే ప్రశ్న లేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీలు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కవిత. బీజేపీ ఎంపీల ఇండ్లను ముట్టడించి.. రాజీనామాకు ఒత్తిడి చేస్తామన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీనే అడ్డుపడుతుందన్న విషయాన్ని బీసీ బిడ్డలు గుర్తించాలని అన్నారు.
తన కొడుకుతో పాటు తమ కుటుంబమంతా బీసీలకు అండగా ఉంటామని..అందుకే తన కుమారుడితో కలిసి ధర్నాలో పాల్గొన్నట్లు చెప్పారు కవిత. బీసీలకు మద్దతు ఇస్తున్నామంటూనే అన్ని పార్టీలు మభ్యపెడుతున్నాయని విమర్శించారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ బంద్ కు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. 42 శాతం బిల్లును తక్షణమే అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలన్నారు.