డాడీ.. మీరు బీజేపీని ఇంకా టార్గెట్​ చేయాల్సింది.. కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఈ నెల 2న కవిత లేఖ?

డాడీ.. మీరు బీజేపీని ఇంకా టార్గెట్​ చేయాల్సింది.. కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఈ నెల 2న కవిత లేఖ?
  • అలా చేయకపోయేసరికి ఊహాగానాలు మొదలయ్యాయి
  • ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమోనని మన కేడర్​ అనుమానిస్తున్నది
  • బీఆర్​ఎస్​ సిల్వర్​ జూబ్లీ సభపై పాజిటివ్​, నెగిటివ్​ అంశాలు ప్రస్తావన
  • అందరినీ కలవాలని, అందరి అభిప్రాయాలు వినాలని లేఖలో సూచన

హైదరాబాద్, వెలుగు: బీఆర్​ఎస్​ సిల్వర్​ జూబ్లీ సభలో బీజేపీ గురించి ఎక్కువగా మాట్లాడకపోవడంతో.. భవిష్యత్​లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమోనన్న ఊహాగానాలు కేడర్​లో వినిపిస్తున్నాయని కేసీఆర్​ను ఉద్దేశిస్తూ ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత  రాసినట్లు ఓ లేఖ బయటకు వచ్చింది. ‘‘డాడీ.. మీరు సభలో బీజేపీని ఇంకొంచెం టార్గెట్​ చేసి మాట్లాడాల్సి ఉండె.  బీఆర్​ఎస్​ కేడర్​కే కాదు నాకు కూడా ఇదే అనిపించింది.

బీజేపీ వల్ల నేను పడిన ఇబ్బందులే ఇందుకు కారణం కావొచ్చు. రాష్ట్రంలో బీజేపీ ఆల్టర్నేట్​ అవుతుందేమోనని మన కేడర్​ ఎక్స్​ ప్రెస్​ చేస్తున్నది” అని లెటర్​లో ఉంది. గత నెల 27న వరంగల్​లోని బీఆర్​ఎస్​ సిల్వర్​ జూబ్లీ సభ జరిగింది. ఈ సభకు సంబంధించి పాజిటివ్​, నెగెటివ్​ విషయాలను ప్రస్తావిస్తూ ఈ నెల 2న కేసీఆర్​కు కవిత రాసినట్లు ఓ లేఖ గురువారం బయటకు వచ్చింది. 

బీసీ రిజర్వేషన్లపై మాట్లాడకపోవడం నిరాశపరిచింది

‘‘సిల్వర్​ జూబ్లీ సభలో వక్ఫ్​ బిల్లు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలపై డాడీ (కేసీఆర్​).. మీరు మాట్లాడకపోవడం కేడర్​ను నిరాశకు గురి చేసింది. ఇంత పెద్ద మీటింగ్​కు పాత ఇన్​చార్జులకే బాధ్యతలివ్వడంతో.. ఉద్యమకారులకు సరైన సదుపాయాలు కల్పించలేదని కొన్ని నియోజకవర్గాల నుంచి ఫీడ్​ బ్యాక్​ వచ్చింది. మళ్లీ పాత ఇన్​చార్జులకే లోకల్​ బాడీ ఎలక్షన్లలో బీఫాంలు ఇస్తారన్న ప్రచారం కొన్ని చోట్ల జరుగుతున్నది.

సర్పంచులుగా పోటీ చేయాలనుకునేవాళ్లు కొంత రిలాక్స్​డ్​గానే ఉన్నా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీగా పోటీ చేయాలనుకునేవాళ్లు మాత్రం రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచే డైరెక్ట్​గా బీఫాంలు తీసుకోవాలని కోరుతున్నారు. మీ స్పీచ్​ పవర్​ఫుల్​గానే ఉన్నా.. ఇంకొంచెం పంచ్​ ఉంటే బాగుండేదని కేడర్​ భావించారు” అని లేఖలో ఉంది. వరంగల్​ సభలో కేసీఆర్​ ప్రసంగంతో అందరూ సంతోషించారని, ఆపరేషన్​ కగార్​ గురించి మాట్లాడటం చాలా మందికి నచ్చిందని లేఖలో కవిత పేర్కొన్నట్లు ఉంది.

‘‘తెలంగాణ అంటే బీఆర్​ఎస్​.. తెలంగాణ అంటే కేసీఆర్​ అని మీరు బలంగా చెప్తారని చాలా మంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు.. తెలంగాణ గీతం విషయంపై మీరు స్పందిస్తారని భావించారు. వాటి గురించి మీరు మాట్లాడితే బాగుండేది. ఆపరేషన్​ కగార్​ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది. మీ స్పీచ్​ అయ్యే వరకు కేడర్​ ఆసక్తిగా విన్నారు’’ అని ఆ లేఖలో ఉంది. 

అందరి అభిప్రాయాలు తీసుకోండి

‘‘కాంగ్రెస్​పై క్షేత్ర స్థాయిలో నమ్మకం పోయింది. దీంతో బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనని మన కేడర్​ అనుకుంటున్నరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్​ చేశామనే మెసేజ్​ను కాంగ్రెస్​ బలంగా తీసుకెళ్లింది. దీనిపై మీరు కౌంటర్​ ఇస్తారని, కార్యక్రమాలు నిర్వహిస్తారని కేడర్​ ఎక్స్​పెక్ట్​ చేసింది. ఇకనైనా ఒకట్రెండు రోజులు ప్లీనరీని నిర్వహించండి.

అందరి అభిప్రాయాలను తీసుకుంటే మంచిది. దీనిపై కొంచెం ఆలోచించండి. ఎమ్మెల్యే స్థాయి నేతలు, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లకు మీ అపాయింట్​మెంట్​ దొరకడం లేదని బాధపడుతున్నారు. కొందరినే మీరు కలుస్తున్నారని చాలా మంది అంటున్నారు. దయచేసి అందరినీ కలవండి” అని కేసీఆర్​కు కవిత సూచిస్తున్నట్లుగా  లేఖలో ఉంది.